హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నీ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయి టోర్నీ హైదరాబాద్లో జరుగనున్న నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం ఎల్బీ స్టేడియానికి వచ్చిన ఆయన సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కప్లో పోటీపడేందకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న ప్లేయర్లకు వసతి భోజనం, టోర్నీ నిర్వహణ, సాంకేతిక అంశాలు, ప్రారంభోత్సవ వేడుకల్లో ఎలాంటి లోపాటు లేకుండా ఏర్పాట్లు చేయాలి. ఈ నెల 29న జరిగే ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అన్ని ప్రభుత్వ శాఖలు సమనయ్వంతో పనిచేయాలి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి’ అని అన్నారు. మరోవైపు సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘మండల, జిల్లా స్థాయిలో సీఎం కప్ పోటీలకు అద్భుతమైన స్పందన లభించింది. రెండు టోర్నీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమనయ్వంతో రాష్ట్ర స్థాయికి జట్లను ఎంపిక చేశారు.
పండుగ వాతావరణంలో టోర్నీని నిర్వహించబోతున్నాం. 33 జిల్లాల నుంచి వస్తున్న ప్లేయర్లు తమ జీవిత కాలం టోర్నీ గుర్తుండిపోయేలా ఉండాలి’ అన్నారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో ప్లేయర్లకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. ప్రతి స్టేడియంలో డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ ఓఎస్డీ లక్ష్మి, డీడీ సుజాత, ధనలక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.