టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేదు. తన హెలికాప్టర్ షాట్లతో అద్భుతమైన వ్యూహాలతో భారత జట్టును అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ జట్టుగా నిలిపినీ ఈ జార్ఖండ్ డైనమైట్ గురించి మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ధోనీ బాగా ఆలోచించి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటాడు.
అతను ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగు వేయడం జరగదు. 2011 ప్రపంచకప్లో ఫైనల్ మ్యాచ్ దీనికి మంచి ఉదాహరణ. మంచి ఫామ్లో ఉన్న యువరాజ్ కన్నా ముందు ఆ మ్యాచ్లో తను బ్యాటింగ్కు దిగి, జట్టును విజయ తీరాలకు చేర్చాడీ కెప్టెన్ కూల్. అలాగే టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పే విషయంలో కూడా ఇలాగే సడెన్గా బాంబు పేల్చాడట. ఇదే విషయాన్ని అప్పట్లో జట్టు మేనేజర్గా ఉన్న రవిశాస్త్రి గుర్తుచేసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో అద్భుతంగా పోరాడిన భారత జట్టు ఆ మ్యాచ్ను డ్రా చేసుకుంది. ‘మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ నా దగ్గరకొచ్చాడు. రవి భాయ్, కుర్రాళ్లతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అద్భుతంగా ఆడి మ్యాచ్ డ్రా చేసుకున్నాం కదా. దాని గురించే ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా’ అని అప్పటి సంఘటనలను రవిశాస్త్రి వెల్లడించాడు.
ఆటగాళ్లంతా కూర్చొని ఉండగా ధోనీ సడెన్గా ‘ఇక టెస్టు క్రికెట్ ఆడను’ అని చెప్పాడని ఈ మాజీ కోచ్ తెలియజేశాడు. ఈ మాటలు విన్న కుర్రాళ్లంతా షాకైపోయారని, అయితే ధోనీ ఇలాగే చేస్తాడని పేర్కొన్నాడు. 2014 డిసెంబరు 30న మెల్బోర్న్ టెస్టు పూర్తయిన తర్వాత టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. తన తర్వాత కెప్టెన్గా కోహ్లీ ఉన్నాడని ధ్రువీకరించుకున్నాకే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.