IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. లక్నోలోని ఎక్నా స్టేడియాన్ని పొగమంచు(Fog) కమ్మేయడంతో టాస్ వేయకుండానే మ్యాచ్ను నిలిపివేశారు అంపైర్లు. దాంతో.. సిరీస్లో ఇక్కడే పట్టేయాలనుకున్న టీమిండియా, సమం చేయాలనుకున్న సఫారీ జట్టు నిరాశకు లోనయ్యాయి. సుమారు 2 గంటలకుపైగా స్టేడియంలో పడిగాపులు కాసిన అభిమానులు ఉసూరుమన్నారు. ఇరుజట్ల మధ్య డిసెంబర్ 19న జరిగే ఐదో మ్యాచ్ విజేతను నిర్ణయించనుంది.
స్వదేశంలో మరో పొట్టి సిరీస్ విజయంపై గురి పెట్టిన భారత జట్టుకు లక్నో వాతావరణం షాకిచ్చింది. టాస్కు ముందు నుంచే స్టేడియంలో దట్టంగా పరుచుకున్న పొగమంచు రెండు గంటలైనా అలానే ఉండిపోయింది. పలుమార్లు మైదానంలోపలికి వచ్చి లైటింగ్, ఫాగ్ను పరిశీలించిన అంపైర్లు చివరకు ఆట సాధ్యపడదనే నిర్ణయానికి వచ్చారు.
𝐔𝐩𝐝𝐚𝐭𝐞: The fourth India-South Africa T20I is called off due to excessive fog.#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/QWDUVFxVlP
— BCCI (@BCCI) December 17, 2025
రాత్రి 9:25 గంటలకు మరోసారి మైదానంలోకి వెళ్లిన అంపైర్లు .. పరిస్థితిలో ఏ మార్పు లేదని, ఇలాంటి వాతావరణంలో ఆట సాధ్యం కాదని ఇరుజట్ల కెప్టెన్లకు వివరించి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో.. లక్నోలో గెలిచి సిరీస్ సమం చేయాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశలు ఆవిరయ్యాయి. డిసెంబర్ 19న అహ్మదాబాద్లో ఆ జట్టు గెలిస్తేనే సిరీస్ పంచుకోగలదు. ఒకవేళ టీమిండియానే విజయం సాధిస్తే.. 3-1తో ట్రోఫీని అందుకుంటుంది.