బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జోరు కనబరుస్తున్నది. నిలకడైన ప్రదర్శనతో చెలరేగుతున్న ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచింది. శనివారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 41-22తో గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించింది. ఢిల్లీ తరఫున విజయ్ మాలిక్ (8 పాయింట్లు), సందీప్ (6), అషు (6), మన్జీత్ (5), క్రిషన్ (5) రాణించారు. గుజరాత్ తరఫున పర్దీప్ కుమార్ (7) మినహా తక్కినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇప్పటి వరకు లీగ్లో 14 మ్యాచ్లాడిన ఢిల్లీ 8 విజయాలతో 48 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు బుల్స్ (46), పట్నా పైరెట్స్ (45) ఆ తర్వాత వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. ఎన్నో ఆశలతో లీగ్లో అడుగుపెట్టిన తెలుగు టైటాన్స్ ఒక్కటంటే ఒకటే విజయంతో అట్టడుగున కొనసాగుతున్నది. ఆదివారం జరుగనున్న మ్యాచ్లో పట్నా పైరెట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనుంది.
పీకేఎల్ షెడ్యూల్ విడుదల
ప్రొ కబడ్డీ లీగ్ తదుపరి షెడ్యూల్ను నిర్వాహకులు విడుదల చేశారు. సోమవారం నుంచి మొదలవుతున్న షెడ్యూల్ అభిమానులకు మరింత పసందైన విందు అందించనుంది. ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకం కావడంతో జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఏడు వారాల కోసం ప్రకటించిన షెడ్యూల్లో ఈనెల 31న హర్యానా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత దబాంగ్ ఢిల్లీ, యూ ముంబా, మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్.. గుజరాత్ జెయింట్స్, యూపీ యోధాతో మ్యాచ్లకు సిద్ధం కాగా.. దక్షిణాది పోరులో భాగంగా బెంగళూరు బుల్స్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్ మధ్య రసవత్తర మ్యాచ్లు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.