న్యూఢిల్లీ: క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan)కు ఢిల్లీలోని పాటియాలా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరీ చేసింది. భార్య అయేషా ముఖర్జీ నుంచి అతనికి ఊరట లభించింది. తన భార్య మానసిక వేదనకు గురిచేసినట్లు ధావన్ తన పిటీషన్లో పేర్కొన్నాడు. విడాకుల పిటీషన్లో ధావన్ చేసిన అన్ని ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు జడ్జి హరీశ్ కుమార్ తన తీర్పులో వెల్లడించారు. ధావన్ చేసిన ఆరోపణలపై అయేషా ఎటువంటి ప్రతి ఫిర్యాదు చేయలేదని, కనీసం తన వాదనను కూడా ఆమె డిఫెండ్ చేసుకోలేకపోయినట్లు కోర్టు వెల్లడించింది.
ఏకైక కుమారుడిని దూరంగా పెట్టి తనను మానసికంగా వేధించినట్లు భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు నిజమే అని జడ్జి పేర్కొన్నారు. కుమారుడి పర్మినెంట్ కస్టడీపై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇండియా, ఆస్ట్రేలియాల్లో ఉన్న సమయంలో తన కుమారుడిని విజిట్ చేసేందుకు ధావన్కు హక్కులు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అబ్బాయితో వీడియో కాల్లో మాట్లాడేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. స్కూలు సెలువు దినాల్లో కొన్ని రోజుల పాటు ఇండియాలోనే ధావన్ ఫ్యామిలీతో పిల్లవాడు గడిపేలా చర్యలు తీసుకోవాలని అయేషాను కోర్టు ఆదేశించింది.