వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. టోర్నీ ఆరంభ దశలో పడుతూ లేస్తూ ఆడిన ఆ జట్టు.. కీలకమైన ఎలిమినేటర్ పోరులో మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. వడోదరలో గుజరాత్ జెయింట్స్తో జరిగిన పోరులో ప్రత్యర్థిని 7 వికెట్ల తేడాతో చిత్తుచేసిన ఢిల్లీ.. ఈనెల 5న (గురువారం) ఇదే వేదికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. లిజెల్లె లీ (24 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (23 బంతుల్లో 41, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 వద్దే పరిమితమైంది. బెత్ మూనీ (51 బంతుల్లో 62 నాటౌట్, 6 ఫోర్లు), జార్జియా వర్హెమ్ (35) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎప్పట్లాగే ఢిల్లీకి ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. లీ, షెఫాలీ (21 బంతుల్లో 31, 7 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 75 రన్స్ చేసింది. మొదట రాజేశ్వరి 3వ ఓవర్లో షెఫాలీ రెండు బౌండరీలు బాదగా డివైన్ ఓవర్లో రెండు ఫోర్లతో కలుపుకుని 17 పరుగులొచ్చాయి. రేణుకా 5వ ఓవర్లో అయితే లీ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగగా షెఫాలీ రెండుసార్లు బంతిని బౌండరీ లైన్ దాటించింది. వర్హెమ్ రాకతో గుజరాత్కు డబుల్ బ్రేక్ దక్కింది. ఆమె వేసిన 8వ ఓవర్ తొలి బంతికి లీ వికెట్ల ముందు దొరికిపోగా ఆఖరి బంతికి షెఫాలీ వర్హెమ్కే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. కానీ అప్పటికే ఢిల్లీ లక్ష్యంలో సగాన్ని ఊదేసింది. వారి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన వోల్వార్ట్ (32*), జెమీమా నిలకడగా ఆడి ఆ జట్టును గెలుపు దిశగా మరింత చేరువ చేశారు. క్రీజులో కుదురుకున్నాక ధాటిగా ఆడిన జెమీమా.. విజయానికి 9 పరుగుల దూరంలో ఔట్ అయినా వోల్వార్ట్, కాప్ (4*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
రెండో ఓవర్లోనే డెవిన్ (6)వికెట్ను కోల్పోయినా పవర్ ప్లేలో గుజరాత్ నిలకడగానే ఆడింది. కాప్ వేసిన 4వ ఓవర్లో 17 పరుగులు రాబట్టి జోరు మీద కనిపించిన ఆ జట్టుకు ఆరో ఓవర్లో బంతినందుకున్న నందని వరుస బంతుల్లో షాకిచ్చింది. తొలి బంతికి అనుష్క (16)ను వెనక్కిపంపిన ఆమె.. రెండో బంతికి గుజరాత్ సారథి ఆష్లీ గార్డ్నర్ను డకౌట్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టింది. దీంతో గుజరాత్ స్కోరు వేగం నెమ్మదించింది. 9వ ఓవర్లో మిన్ను మణి.. కనిక అహుజా (6)నూ బోల్తా కొట్టించడంతో క్రీజులోకి వచ్చిన వర్హెమ్ (35)తో కలిసి మూనీ ఇన్నింగ్స్ను నిలబెట్టింది. కానీ హెన్రీ 17వ ఓవర్లో గుజరాత్కు డబుల్ షాకులిచ్చింది. వర్హెమ్తో పాటు ఫల్మలిని ఔట్ చేసి ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేసింది.
గుజరాత్: 20 ఓవర్లకు 168/7 (మూనీ 62*, వర్హెమ్ 35, హెన్రీ 3/35, నందని 2/23);
ఢిల్లీ: 15.4 ఓవర్లకు 169/3 (లీ 43, జెమీమా 41, వర్హెమ్ 2/28, రాజేశ్వరి 1/33)