Deepti Sharma : భారత మహిళల జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) పొట్టి క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించింది. విరాట్ కోహ్లీ(Virat Kohli), హిట్మ్యాన్, బుమ్రా వంటి దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్గా దీప్తి రికార్డు నెలకొల్పింది.
ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. రెండో టీ20లో టాపార్డర్ విఫలమవ్వడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన దీప్తి 30 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించింది.
అనంతరం బౌలింగ్లో సత్తా చాటుతూ రెండు కీలక వికెట్లు తీసింది. కానీ, ఎలీసా పెర్రీ(34 నాటౌట్), ఫొబే లిచ్ఫీల్డ్(18 నాటౌట్) అద్భుతంగా ఆడి ఆసీస్ను గెలిపించారు. దాంతో, కంగారూ జట్టు సిరీస్ సమం చేసింది.
విరాట్ కోహ్లీ
పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ 115 మ్యాచుల్లో 4,008 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 3,853 రన్స్తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.