DC vs PBKS | పంజాబ్ కింగ్స్ పూర్తిగా తమ చేతుల్లో ఉన్న మ్యాచ్ను చేజార్చుకుని చేదు ఓటమిని మూటగట్టుకుంది. ధర్మశాలలో జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో ఒక దశలో మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన పంజాబ్, చివరకు మిడిల్ ఓవర్లలో బౌలర్ల వైఫల్యంతో ఓటమిని చవిచూసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత కంబ్యాక్తో 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210/5 భారీ స్కోర్ నమోదు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయడంతో పాటు చివరి ఓవర్లలో కూడా బలమైన ఫినిషింగ్ రావడంతో జట్టు భారీ స్కోర్ను అందుకుంది. ఆ తర్వాత బౌలింగ్లో కూడా పవర్ ప్లేలోనే ఢిల్లీ టాప్ ఆర్డర్ను కూల్చివేసి మ్యాచ్పై పట్టు సాధించింది.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ రెండో ఓవర్లో ఔట్ కాగా, కేఎల్ రాహుల్ మూడో ఓవర్లో పెవిలియన్ చేరాడు. సాహిల్ పరాఖ్ కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో ఐదు ఓవర్లకే ఢిల్లీ 33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. మొదట ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టిన అక్షర్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్తో కలిసి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇద్దరూ వేగంగా పరుగులు సాధిస్తూ మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పేశారు.
ఒక దశలో భారీ ఓటమి తప్పదనుకున్న ఢిల్లీకి అక్షర్-మిల్లర్ భాగస్వామ్యంతో మళ్లీ రేసులోకి వచ్చింది. అక్షర్ ఔట్ అయిన తర్వాత కూడా మిల్లర్ దూకుడు తగ్గలేదు. వరుస బౌండరీలు, సిక్సర్లతో మ్యాచ్ను పూర్తిగా ఢిల్లీ ఆధీనంలోకి తీసుకొచ్చాడు. చివర్లో అశుతోష్ శర్మ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో ఢిల్లీ విజయాన్ని ఖాయం చేసింది. అయితే ఈ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింట్ మిడిల్ ఓవర్లే అయ్యాయి. 9వ ఓవర్లో వికెట్ తీసిన పంజాబ్ బౌలర్లు, 14వ ఓవర్ వరకు మరో వికెట్ పడగొట్టలేకపోయారు. ఈ ఐదు ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించడంతో మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారిపోయింది. బౌలింగ్లో అర్షదీప్ సింగ్ మాత్రమే కాస్త ప్రభావం చూపించాడు.
నాలుగు ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. యశ్ ఠాకూర్ నాలుగు ఓవర్లలో 55 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకోగా, యాన్సెస్ 45 పరుగులు ఇచ్చాడు. బెన్ ద్వార్షుయీస్ కూడా నాలుగు ఓవర్లలో 51 పరుగులు సమర్పించుకోవడం పంజాబ్కు భారీ నష్టం కలిగించింది. ముఖ్యంగా కీలక సమయంలో బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ కోల్పోవడం, మిడిల్ ఓవర్లలో ఒత్తిడి సృష్టించలేకపోవడం పంజాబ్ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్కు ఇది మరో ఎదురుదెబ్బగా మారింది.