లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్ తడబడింది. ఓపెనర్ పృథ్వీ షా (61) ఆకట్టుకోగా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (4) నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రావ్మెన్ పావెల్ (3) కూడా మరోసారి అవకాశాన్ని వృధా చేసుకున్నాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (39 నాటౌట్) బ్యాటు ఝళిపించలేకపోయాడు. ఎప్పట్లా స్వేచ్ఛగా ఆడటానికి సంకోచించాడు.
అతనికి జతకలిసిన సర్ఫరాజ్ ఖాన్ (38 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. అప్పటి వరకు టెస్టు మ్యాచ్లా ఆడిన పంత్.. చివర్లో తేరుకొని రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. అయితే జేసన్ హోల్డర్ చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో అతను వేసిన రెండు ఓవర్లలో ఢిల్లీ బ్యాటర్లు పరుగులు పిండుకోవడానికి తంటాలు పడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో బిష్ణోయి 2, గౌతమ్ ఒక వికెట్ తీసుకున్నారు.