ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఒక్కపూట కూడా తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్న శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతటి క్లిష్ట సమయాల్లో కూడా ఆ దేశ ప్రజలు తమపై ఎంతో ఆదరాభిమానాలు కురిపించారని.. వారి ప్రేమ తమను కదిలించిందని పేర్కొన్నాడు. లంక పర్యటనను ముగించుకుని ఆస్ట్రేలియా తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో వార్నర్ ఇన్స్టా వేదికగా భావేద్వేగ నోట్ షేర్ చేశాడు.
‘ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాకు ఆతిథ్యమిచ్చినందుకు థాంక్యూ శ్రీలంక. ఇక్కడకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం. మేమిక్కడున్నన్ని రోజులూ మాపై మీరు ప్రేమ, ఆదరణ చూపిస్తూనే ఉన్నారు. మాకు ఎల్లవేళలా మద్దతునిచ్చారు. ఈ పర్యటనను మేము ఎప్పటికీ మరిచిపోలేం..
మీ దేశంలో నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే.. దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు తలెత్తినా మీ ముఖం నుంచి చిరునవ్వు చెదరలేదు. మేం ఎక్కడికి వెళ్లినా మాకు స్వాగతం పలికారు. థాంక్యూ. నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడకు హాలీడేకు రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను…’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు చేస్తూ వార్నర్.. శ్రీలంక జాతీయ జెండాను షేర్ చేయడం గమనార్హం.
ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా లంక పర్యటనకు వెళ్లారు. లంకలో జూన్ 7 న మొదలైన ఆసీస్ పర్యటన సోమవారం గాలేలో ముగిసిన రెండో టెస్టుతో పూర్తైంది. ఈ టూర్ లో ఆసీస్.. టీ20 సిరీస్ ను గెలుచుకుని వన్డే సిరీస్ ను కోల్పోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ను సమం చేసుకుంది.