న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక బ్యాట్స్మెన్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన తన ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ జీవితం గురించి సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్టులు పెడుతుంటాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో తరచూ చర్చలు చేస్తుంటారు. తాజాగా మరో ఇన్స్టా పోస్టుతో ఆయన అభిమానుల ముందుకు వచ్చాడు.
తన టెలివిజన్ స్క్రీన్పై కనిపించిన భారతీయ సినిమాల పోస్టర్ను ఫోన్ కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అందులో ఆనంద్, బద్లా, బాహుబలి, బర్ఫీ, దంగల్, గల్లీ బోయ్, దేవదాస్, దిల్వాలే దుల్హానియా లే జాయెంగే తదితర చిత్రాలకు సంబంధించిన ఐకాన్లు ఉన్నాయి. దానికింద వీటిలో ఏ సినిమా చూడమంటారు..? అంటూ వార్నర్ భారత అభిమానులను ప్రశ్నించారు. అంతేగాక లాక్డౌన్, స్టే సేఫ్, స్టే హోమ్ అని కూడా క్యాప్షన్ ఇచ్చాడు.
దాంతో వార్నర్ పోస్టుపై అభిమానుల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేట్ శ్రీవాత్సవ్ గోస్వామి గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమా చూడమని రికమెండ్ చేయగా, ఆస్ట్రేలియా సహచరుడు ఉస్మాన్ ఖవాజా త్రి ఇడియట్స్ చూడమని సూచించాడు. హైదరాబాదీలు చాలా మంది అల వైకుంఠపురంలో, వకీల్ సాబ్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తదితర సినిమాలను రికమెండ్ చేశారు.
దాంతో వార్నర్.. మీరు సూచించిన వాటిలో ఏది ముందుగా చూడాలనే విషయంలో కన్ఫ్యూజన్గా ఉంది అని బదులిచ్చాడు. లాక్డౌన్ కారణంగా ఇంటికి చేరుకున్న వార్నర్ తన భార్య క్యాండిస్, కుమార్తెలు ఇవీ మే, ఇండి రే, ఇస్లా రోస్తో సరదాగా గడుపుతున్నాడు. ఇటీవల వార్నర్ తన కుటుంబం పెంచుకున్న ఓ కుక్కపిల్ల కవూడిల్ కుకీ ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. మా ఇంటికి మరో ఆడపిల్ల వచ్చిందంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు.