Sanjita Chanu @ dope test | రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత సంజితా చాను డోప్ పరీక్షలో విఫమైంది. అనాబాలిక్ స్టెరాయిడ్ డ్రోస్టానోలోన్ తీసుకున్నందుకు దోషిగా తేలింది. గత ఏడాది గాంధీనగర్లో జరిగిన జాతీయ క్రీడల్లో సాధించిన పతకాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. ఏ ఈవెంట్లో కూడా ఆడకుండా ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిషేధం విధించింది. పరీక్షల శాంపిల్స్ తీసుకున్న రోజు నుంచి నిషేధం అమల్లోకి ఉంటుందని నాడా తన ప్రకటనలో పేర్కొన్నది.
గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో గుజరాత్లో జాతీయ క్రీడలు జరిగాయి. సెప్టెంబర్ 30న నిర్వహించిన మహిళల 49 కేజీల వెయిల్ లిఫ్టింగ్ విభాగంలో మణిపూర్కు చెందిన సంజితా చాను రజత పతకాన్ని గెలుచుకున్నది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను బంగారు పతకం సాధించింది.
ఈ క్రీడల సందర్భంగా సంజితా చాను డోప్ శాంపిల్ తీసుకున్నారు. పరీక్షలో నిషేధిత డోస్టానోలోన్ అవశేషాలను గుర్తించారు. సంజితా చాను కేసును నాడా డిసిప్లినరీ ప్యానెల్ విచారిస్తున్నది. దోషిగా తేలితే ఆమెపై నాలుగేండ్లపాటు నిషేధం విధించే అవకాశం ఉన్నది.
2014 కామన్వెల్త్ గేమ్స్ 48 కేజీల విభాగంలో తలపడి బంగారు పతకం సాధించిన సంజితా చాను.. 2018 కామన్వెల్త్ గేమ్స్లో 53 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నది. ఇంతకు ముందు 2018 మే నెలలో జరిపిన డోప్ పరీక్షలో ఆమె నమూనాల్లో టెస్టోస్టెరాన్ డ్రగ్ను గుర్తించారు. దాంతో ఆమెపై అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ ఫెడరేషన్ నేషధం విధించింది. 2020 లో ఈ అభియోగం నుంచి బయటపడిన సంజితా చాను.. తన నమూనాలను అంతర్జాతీయ ఫెడరేషన్ తారుమారు చేసినట్లు ఆరోపించింది.