జులై 28 నుంచి యూకేలోని బర్మింగ్హోమ్ వేదికగా ప్రారంభం కావాల్సి ఉన్న కామన్వెల్త్ క్రీడలకు ముందు పలువురు అథ్లెట్లు అబాసుపాలవుతున్నారు. డోప్ టెస్టులలో పట్టుబడుతూ ఉజ్వల కెరీర్లు పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే కామన్వెల్త్కు వెళ్లబోయే నలుగురు అథ్లెట్లు డోపీలుగా తేలగా తాజాగా మరో అథ్లెట్ కూడా అదే బాటలో పయనించి పోటీల నుంచి వైదొలిగింది.
మహిళల 4×100 మీటర్ల బృందంలో సభ్యురాలిగా ఉన్న ఓ అథ్లెట్ (పేరు వెల్లడించలేదు) తాజాగా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్లో పాజిటివ్గా తేలినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) పీటీఐతో మాట్లాడుతూ.. ‘మహిళల 4×100 మీటర్ల బృందంలోని సభ్యురాలు డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో ఆమెను ఈ పోటీల నుంచి తప్పించాం..’ అని తెలిపింది.
ఇదిలాఉండగా తాజా ఘటనతో కామన్వెల్త్కు వెళ్లబోయే క్రీడాకారులలో డోప్ టెస్టులో పట్టుబడ్డ వారి సంఖ్య ఐదుకు చేరింది. గతంలో మహిళల 4×100 మీటర్ల బృందంలోని అగ్రశ్రేణి స్ప్రింటర్ ధనలక్ష్మీ డోప్ టెస్టులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆమెతో పాటు ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు కూడా డోపీగా తేలింది. వీరిద్దరేగాక గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లైలు కూడా డోప్ టెస్టులో దోషులుగా తేలారు.
కాగా కామన్వెల్త్ క్రీడలకు గాను మహిళల 4×100 మీటర్ల బృందంలో ఏఎఫ్ఐ ద్యుతీ చంద్, హిమా దాస్, సర్బానీ నంద, ఎన్ఎస్ సిమి, శేఖర్ ధనలక్ష్మీలను ముందుగా ఈ పోటీలకు ఎంపిక చేసింది. కానీ ధనలక్ష్మీ డోపీగా తేలడంతో ఆమె స్థానాన్ని ఎంవీ జిల్నాతో భర్తీ చేశారు. వీరిలో ఒకరు డోపీగా తేలడంతో కామన్వెల్త్ క్రీడలకు వెళ్లే సభ్యులలో నలుగురే ఉంటారు. వీరిలో ఎవరైనా గాయపడితే మాత్రం అది భారత ప్రదర్శన మీదే ప్రభావం చూపనుంది.