వరుస పరాజయాలకు స్వస్తి పలుకుతూ.. కీలక దశలో న్యూజిలాండ్ కలిసికట్టుగా కదంతొక్కింది. సెమీస్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో శ్రీలంకను తుక్కు కింద కొట్టింది. గత మ్యాచ్లో నాలుగొందలకు పైగా స్కోరు చేసినా పరాజయం పాలైన కివీస్ ఈసారి భారీ విజయం ఖాతాలో వేసుకొని రన్రేట్ మెరుగుపరుచుకుంది. ఇక అద్భుతాలు జరిగితే తప్ప సెమీస్లో టీమ్ఇండియాతో న్యూజిలాండ్ తలపడటం ఖాయమే!
Cricket World Cup | బెంగళూరు: న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో వరుసగా నాలుగు పరాజయాల తర్వాత విలియమ్సన్ సేన విజయం సాధించింది. గురువారం జరిగిన పోరులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి నాకౌట్ బెర్త్కు మరింత చేరువైంది. మెగాటోర్నీలో ఆడిన తొలి నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన న్యూజిలాండ్.. ఆ తర్వాత వరుసగా నాలుగింట ఓడి.. చివరి లీగ్ మ్యాచ్లో విజయంతో సెమీస్ రేసులో నిలిచింది. లీగ్ దశలో 9 మ్యాచ్లు ఆడిన కివీస్ 10 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
పాకిస్థాన్ (+0.036), అఫ్గానిస్థాన్ (-0.338)కు అధికారికంగా అవకాశం ఉన్నా.. రన్రేట్లో న్యూజిలాండ్ (+0.743) చాలా మెరుగ్గా ఉంది. దీంతో తమ చివరి మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాపై అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్పై పాకిస్థాన్ అసాధారణ ప్రదర్శన చేస్తే తప్ప కివీస్ను దాటి ముందంజ వేయడం కష్టమే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుషాల్ పెరెరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఈ వరల్డ్కప్లోనే వేగవంతమైన అర్ధశతకంతో రికార్డు సృష్టిస్తే మిగిలినవాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. చివర్లో తీక్షణ (91 బంతుల్లో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కెప్టెన్ కుషాల్ మెండిస్ (6), నిషాంక (2), సమరవిక్రమ (1), అసలంక (8) మాథ్యూస్ (16), ధనంజయ డిసిల్వ (19), కరుణరత్నె (6) ప్రభావం చూపలేకపోయారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, ఫెర్గూసన్, శాంట్నర్, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కాన్వే (45; 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (42), డారిల్ మిషెల్ (43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. లంక బౌలర్లలో మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా తొమ్మిది మ్యాచ్లాడిన లంక రెండు విజయాలతో ఇంటిబాట పట్టింది. బౌల్ట్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో మూడు సెమీస్ బెర్త్లు ఖాయం అయిపోగా.. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలువడం ఖాయంగా కనిపిస్తున్నది. పాకిస్థాన్ (+0.036), అఫ్గానిస్థాన్ (-0.338)అధికారికంగా పోటీలో ఉన్నా.. ఆ జట్ల రన్రేట్లు మరీ తక్కువగా ఉండటంతో తమ చివరి మ్యాచ్ల్లో నెగ్గిన న్యూజిలాండ్ (+0.743)ను దాటేయడం కష్టమే! నాకౌట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్.. చివరి బెర్త్ దక్కించుకోవాలంటే.. ఇంగ్లండ్పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.
మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రమే పాక్కు అవకాశం ఉంది. అందులోనూ ఇంగ్లిష్ టీమ్ను 275 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడిస్తేనే రన్రేట్లో కివీస్ను దాటి నాలుగో స్థానానికి చేరుకోనుంది. ఇక అఫ్గాన్కు ఎలా చూసిన సెమీస్ దారులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టేబుల్ టాపర్గా ఉన్న టీమ్ఇండియా.. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుండటం ఖాయమే! 2019 ప్రపంచకప్లోనూ న్యూజిలాండ్తోనే భారత్ తలపడగా.. వర్షం అంతరాయం మధ్య సాగిన ఆ పోరులో టీమ్ఇండియా పరాజయం పాలై రిక్తహస్తాలతో వెనుదిరిగిన విష యం తెలిసిందే!
శ్రీలంక: 46.4 ఓవర్లలో 171 ఆలౌట్ (కుషాల్ పెరెరా 51; తీక్షణ 38 నాటౌట్; బౌల్ట్ 3/37, రచిన్ 2/21),
న్యూజిలాండ్: 23.2 ఓవర్లలో 172/5 (కాన్వే 45, డారిల్ 43; మాథ్యూస్ 2/29).