తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ను లియామ్ లివింగ్స్టోన్ (60) ఆదుకున్నాడు. వెటరన్ ధావన్ (33)తో కలిసి రెచ్చిపోయిన లివింగ్స్టోన్.. పంజాబ్ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు. రాయుడు క్యాచ్ జారవిడవడంతో లభించిన లైఫ్ను చక్కగా ఉపయోగించుకున్న అతను భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
అయితే పదో ఓవర్ చివరి బంతికి నిలకడగా రాణిస్తున్న ధవన్ను డ్వేన్ బ్రావో అవుట్ చేశాడు. బ్రావో వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా ఆడేందుకు ధవన్ ప్రయత్నించాడు. కానీ టైమింగ్ సరిగా కుదరలేదు. అక్కడకు పరిగెత్తుకొచ్చిన జడేజా క్యాచ్ అందుకోవడంతో శిఖర్ వెనుతిరిగాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే బంతి అందుకున్న జడేజాకు లివింగ్స్టోన్ సిక్సర్తో స్వాగతం పలికాడు. అయితే అదే ఓవర్ మూడో బంతికి రాయుడుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 10.3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.