పాయింట్ల పట్టికలో చివరన ఉన్న మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ తలపడిన మ్యాచ్లో అనుకోని అవాంతరం ఎదురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా తొలి పది బంతుల వరకు డీఆర్ఎస్ లేకుండా పోయింది. గురువారం ముంబైతో మ్యాచ్లో తొలుత చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా.. 1.4 ఓవర్ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొదటి ఓవర్లో డానియల్ సామ్స్ బౌలింగ్లో ఓపెనర్ డెవాన్ కాన్వె (0), జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రాబిన్ ఊతప్ప (1) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యారు. కరెంట్ అసౌకర్యంతో వీరి ఔట్పై డీఆర్ఎస్ వెళ్లడానికి వీలు కుదరలేదు. ఇదే తమ జట్టు కొంపముంచిందని చెన్నై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం విద్యుత్ అందుబాటులోకి రావడంతో యథావిధిగా మ్యాచ్ కొనసాగింది. అయితే విద్యుత్ కొరత కారణంగా కాదని.. షార్ట్ సర్క్యూట్తో అంతరాయం ఏర్పడిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.