ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ కుప్పకూలింది. పిచ్ బౌలింగ్కు అనుకూలించడంతో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. దానికితోడు మ్యాచ్ ప్రారంభమైన కాసేపటి వరకూ కరెంట్ కోత వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేకుండా పోయింది. దీంతో డెవాన్ కాన్వే (0) డకౌట్ అయ్యాడు. డానియల్ శామ్స్ వేసిన బంతి లెగ్ స్టంప్ను మిస్ అయ్యేలా కనిపించినా కూడా.. డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది.
ఆ తర్వాత కాసేపటికే మొయీన్ అలీ (0), రాబిన్ ఊతప్ప (1) కూడా పెవిలియన్ చేరారు. అప్పటికి కూడా డీఆర్ఎస్ అందుబాటులో లేదు. అనంతరం డీఆర్ఎస్ వచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురైన రుతురాజ్ గైక్వాడ్ (7) కూడా అవుటయ్యాడు. నిలబెడతాడనుకున్న అంబటి రాయుడు (10)ను బుమ్రా అవుట్ చేశాడు. కెప్టెన్ ధోనీ (36 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.
అతనికి ఎవరూ సహకారం అందించలేదు. శివమ్ దూబే (10), డ్వేన్ బ్రావో (12) కాసేపు క్రీజులో ఉన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. చివర్లో టెయిలెండర్లు సిమర్జీత్ సింగ్ (2), మహీష్ తీక్షణ (0), ముకేష్ చౌదరి (4) కూడా నిలబడలేకపోయారు. దీంతో చెన్నై జట్టు 97 పరుగులకే చాపచుట్టేసింది. ముంబై బౌలర్లలో డానియల్ శామ్స్ 3, రైలీ మెరెడిత్ 2 తీయగా.. బుమ్రా, రమణ్దీప్ సింగ్, కుమార్ కార్తికేయ తలో వికెట్ తీసుకున్నారు.