గాయం కారణంగా ఈ ఏడాది టి20 వరల్డ్ కప్కి దూరమయ్యాడు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఈమధ్యే కోలుకున్న అతను త్వరలోనే మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అయితే, అతను ఈ ఏడాది 16వ సీజన్ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడతాడా? లేదంటే కొత్త ఫ్రాంఛైజీ తరఫున బరిలోకి దిగుతాడా? అనే సందేహం చాలామందికి ఉంది. అందుకు కారణం గత సీజన్లో సీఎస్కే యాజమాన్యం అతడిని మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించడమే. ధోని చెప్పడంతో జడేజాకి కెప్టెన్సీ అప్పగించింది సీఎస్కే. అయితే, వరుసగా మ్యాచ్లు ఓడిపోవడంతో అతడిని మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించి, మళ్లీ ధోనికి జట్టు పగ్గాలు అప్పగించింది సీఎస్కే. దాంతో, యాజమాన్యం తీరుపై అసంతృప్తికి గురైన జడేజ వచ్చే సీజన్లో సీఎస్కేని వీడతాడనే వార్తలు వినిపించాయి. జడ్డూ కూడా సోషల్మీడియాలో సీఎస్కేని అన్ఫాలో చేయడంతో ఆ వార్తలు నిజం అనుకున్నారంతా. అయితే, జడ్డూకి ఎం.ఎస్ ధోని సర్థిచెప్పడాట. సీఎస్కే కూడా జడేజాని అట్టిపెట్టుకోవాలని అనుకుంటుందట. దాంతో, ఈ సీజన్లో కూడా జడ్డూ చెన్నై జట్టుకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.
సీఎస్కేతో అనుబంధం
చెన్నై సూపర్కింగ్స్ జట్టులో రవీంద్ర జడేజా కీలక ఆటగాడు. బంతితో, బ్యాటుతో రాణించడమే కాకుండా ఫీల్డింగ్లోనూ అదరగొడతాడు. తన ఆల్రౌండ్ ప్రతిభతో సీఎస్కే ఐపీఎల్ ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు జడ్డూ. 2012 నుంచి ఆ జట్టుతో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరీర్లో210 మ్యాచ్లు ఆడి 2,502 పరుగులు చేశాడు. 132 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్లో సీఎస్కేతో పాటు రాజస్థాన్ రాయల్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, గుజరాత్ లయన్స్ ఫ్రాంఛైజీల తరఫున కూడా ఆడాడు జడేజా.