ఐపీఎల్ అభిమానులు ‘ఎల్క్లాసికో’గా పిలుచుకునే ముంబై- చెన్నై పోరులో భాగంగా ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లో చెన్నైదే పైచేయి అయింది. ముంబైలోని వాంఖెడే వేదికగా ఇరు జట్ల మధ్య ముగిసిన పోరు అభిమానులకు పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ను అందించింది. విజయం కోసం రెండు జట్లూ హోరాహోరి పోరాడినా చెన్నైనే విజయం వరించింది. సీఎస్కే తరఫున దూబే, గైక్వాడ్, ధోనీలు బాదితే ముంబైలో రోహిత్, తిలక్లూ బ్యాట్కు పనిచెప్పారు. హిట్మ్యాన్ ఒంటరిపోరాటం విఫలమైంది.
IPL | ముంబై: ఐపీఎల్లో ఎన్ని మ్యాచ్లు జరిగినా ఈ లీగ్లో అత్యంత విజయవంతమైన జట్లు అయిన ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అంటే ఎందుకంత ప్రత్యేకమో మరోసారి అభిమానుల అనుభవంలోకి వచ్చింది. ఈ సీజన్ ‘ఎల్క్లాసికో’ విజేతగా చెన్నై నిలిచింది. సీఎస్కే నిర్దేశించిన 207 పరుగుల భారీ ఛేదనలో రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో వాంఖెడేను హోరెత్తించినా మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మతీశ పతిరాన (4/28) అద్భుత బౌలింగ్తో ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగుల వద్దే ఆగిపోయి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. రుతురాజ్ గైక్వాడ్ (40 బంతుల్లో 69, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
24/1. తొలి 4 ఓవర్లలో చెన్నై స్కోరది. గైక్వాడ్ను కాదని చెన్నై రచిన్ (21)తో లోకల్ బాయ్ రహానే (5)ను పంపగా అతడు నిరాశపరిచాడు. గైక్వాడ్ రాకతో సీఎస్కే స్కోరు వేగం పుంజుకుంది. కొయెట్జీ ఐదో ఓవర్లో 4,6,4తో అతడు చెన్నై ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. రచిన్ నిష్క్రమించినా దూబేతో కలిసి ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. హార్దిక్ వేసిన పదో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన దూబే.. షెఫర్డ్ 14వ ఓవర్లో 6,6,4తో రెచ్చిపోయాడు. 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన గైక్వాడ్..ఔట్ అయిన శివమ్ దూబే తర్వాత అదే జోరు కొనసాగించాడు. ఆఖరి 4 బంతులున్నాయనగా క్రీజులోకి వచ్చిన ధోనీ (4 బంతు ల్లో 20, 3 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్లతో వాంఖెడేను హోరెత్తించాడు.
భారీ ఛేదనలో ముంబై కూడా బాదుడులో తక్కువేమీ తిన్లేదు. తాను ఎదుర్కొన్న తొలి 10 బంతుల్లో 12 పరుగులే చేసిన రోహిత్.. 4వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. శార్దూల్ 4వ ఓవర్లో 6, 4తో హిట్టింగ్ ఆరంభించిన అతడు.. ఆ తర్వాత ముస్తాఫిజుర్ బౌలింగ్లోనూ అదే రిపీట్ చేయడంతో ముంబై స్కోరు 7 ఓవర్లకే 70 పరుగులకే చేరింది. కానీ పతిరాన ముంబైకి ఒకే ఓవర్లో డబుల్ షాకులిచ్చాడు. ఇషాన్ (15 బంతుల్లో 23, 3 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయినా తిలక్ వర్మతో కలిసి రోహిత్ ముంబై స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ పతిరాన తిలక్ను ఔట్ చేసి మరోసారి ముంబైని దెబ్బకొట్టాడు. ఆఖర్లో ముంబై మిడిల్ ఆర్డర్ చేతులెత్తేయడంతో ఆ జట్టు పరాభవం పాలైంది. రోహిత్ సెంచరీతో అభిమానుల బాధను కాస్త తగ్గించాడు.
చెన్నై : 20 ఓవర్లలో 206/4 (రుతురాజ్ 69, దూబే 66 నాటౌట్, హార్దిక్ 2/43, గోపాల్ 1/9),
ముంబై : 20 ఓవర్లలో 186/6 (రోహిత్ 105 నాటౌట్ , తిలక్ 31, పతిరాన 4/28, తుషార్ 1/29)