హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న అజర్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్(94) మంగళవారం హైదరాబాద్లో కన్నుమూశారు.
బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని మసీద్లో ప్రార్థనలు ముగిసిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్) కోసం ముంబైకి వెళ్లిన అజర్.. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరాడు. తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న అజారుద్దీన్కు పలువురు సానుభూతి వ్యక్తం చేశారు.