ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీధికొకటిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్రికెట్ అకాడమీలపై భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ను విక్రయించొద్దని.. పిల్లలకు దానిని నేర్పించాలని కోరాడు. అకాడమీలు సరైన లక్ష్యాలు లేకుండా ఉన్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని శ్రీనాథ్ తెలిపాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనాథ్ మాట్లాడుతూ.. ‘కొన్ని క్రికెట్ అకాడమీలకు సరైన వైఖరి, లక్ష్యాలు లేవు. మనం వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రైవేట్ అకాడమీలపై నాకు ఎలాంటి కోపం గానీ, వ్యతిరేకత గానీ లేవు. కానీ క్రికెట్ ను విక్రయించకూడదు. పిల్లలకు దానిని శ్రద్ధగా నేర్పించాలి..’ అని అన్నాడు.
అంతేగాక రంజీలను కాపాడుకోవాలని అవి టెస్టు క్రికెట్ కు మొదటి మెట్టు వంటివని శ్రీనాథ్ తెలిపాడు. ‘రంజీ ట్రోఫీ అనేది టెస్ట్ క్రికెట్ ఆడాలనుకునే ఆటగాళ్లకు తొలి మెట్టు. క్రికెట్ కు కనెక్ట్ కావాలనుకుంటే మీరు రంజీలను ఆడాలి. అలా ఆడినప్పుడే ఆట మరో స్థాయికి చేరుతుంది. ఈ విషయంలో మేము చాలా అదృష్టవంతులం. మా లక్ష్యమొకటే. టెస్టు క్రికెట్ లో నిలదొక్కుకోవడం. వన్డేలను కూడా మేం అంతగా పట్టించుకోకపోయేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితులు మరో విధంగా ఉన్నాయి. ఐపీఎల్ ఆట స్వరూపాన్ని మార్చేసింది. ఇది సవాళ్ల సమయం..’ అని తెలిపాడు.
భారత జట్టు తరఫున 67 టెస్టులు, 229 వన్డేలు ఆడాడు శ్రీనాథ్. రెండు ఫార్మాట్లలో కలిపి 551 వికెట్లు కూడా తీశాడు. 1991 నుంచి 2003 మధ్య కాలంలో టీమిండియాలో సభ్యుడైన శ్రీనాథ్.. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీ గా పనిచేస్తున్నాడు.