హైదరాబాద్, ఆట ప్రతినిధి/మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 2: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో క్రికెట్ క్లబ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఆదివారం రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిపై హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్తో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గ్రామీణ క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 6 వేల మైదానాలు ఏర్పాటు చేశాం’ అని అన్నారు. రాష్ట్రంలో క్రికెట్ను మరింత ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయిలో స్టేడియంలు నిర్మించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
మహబూబ్నగర్లో ఉప్పల్ స్థాయి స్టేడియం ఏర్పాటు చేయాలని హెచ్సీఏ చీఫ్ను కోరారు. దీనిపై అజారుద్దీన్ స్పందిస్తూ.. ప్రభుత్వం భూమి కేటాయిస్తే మహబూబ్నగర్లో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు.