హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తూ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని (హెచ్సీఏ) బీసీసీఐ తక్షణమే బ్యాన్ చేయాలని తెలంగాణ క్రికెట్ సంఘం (టీసీఏ) డిమాండ్ చేసింది. టీసీఏ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ స్టేక్హోల్డర్స్’ కార్యక్రమంలో క్రికెట్ నిర్వాహకులు, మాజీ క్రీడాకారులు, జిల్లా ప్రతినిధులుపాల్గొని హెచ్సీఏ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
హెచ్సీఏ కేవలం హైదరాబాద్, రంగారెడ్డికే పరిమితమై మిగతా జిల్లాల క్రికెట్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బీసీసీఐ అనుమతి, హెచ్సీఏ సర్వసభ్య సమావేశం ఆమోదం లేకుండా ఐదేండ్ల కాలానికి ఫ్రాంచైజీలను అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికే ‘టీజీ20 లీగ్’ను తెస్తున్నారని టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి ఆరోపించారు. టీసీఏకు గుర్తింపు వచ్చే వరకు సామాజిక, ప్రజాస్వామ్యబద్ధ పోరాటాలను విస్తృతం చేయాలని సమావేశం నిర్ణయించింది. బీసీసీఐ తక్షణమే టీసీఏకు అసోసియేట్ సభ్యత్వ గుర్తింపు ఇవ్వాలని, దీని కోసం తోటి ఎంపీలతో కలిసి కృషి చేస్తానని టీసీఏ ప్యాట్రన్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.