హోం క్వారంటైన్లో క్రికెట్ దిగ్గజం
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్నందున కరోనా పరీక్ష చేయించుకోగా తనకు పాజిటివ్గా తేలిందని సోషల్ మీడియా ద్వారా మాస్టర్ బ్లాస్టర్ శనివారం వెల్లడించాడు. ‘తరచూ టెస్టులు చేయించుకోవడంతో పాటు కరోనాను దూరంగా ఉంచేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అయినా, ఈ రోజు చేయించుకున్న పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. నాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. మా ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటున్నా. నాతో పాటు దేశంలో ఎంతో మందికి మద్దతుగా ఉన్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని సచిన్ ట్వీట్ చేశాడు. కాగా రోడ్ సేఫ్టీ సిరీస్లో సచిన్తో పాటు ఆడిన యూసుఫ్ పఠాన్కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.