హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఆనందయ్య ఆయుర్వేద వైద్యంతో దేశవ్యాప్తంగా ఆయుర్వేదంపై విపరీతమైన చర్చ జరుగుతున్నది. నిపుణులంతా రెండు వర్గాలుగా చీలిపోయిన ఆయుర్వేదానికి అనుకూల, వ్యతిరేక వాదనలు చేస్తున్నారు. ఆయుర్వేదం మన పూర్వీకులు అందించిన గొప్ప జ్ఞానమని, మొక్కల నుంచి సేకరించిన ఔషధాలను వాడి కరోనాను సైతం తగ్గించవచ్చని కొందరు కుండబద్దలు కొడుతున్నారు. మరికొందరు ఆయుర్వేదానికి శాస్త్రీయత లేదని, అందులో ఉండే రసాయన మిశ్రమాల గురించి తెలియకుండా ఎలా వినియోగిస్తామని వాదిస్తున్నారు. ఆయుర్వేదం పూర్తి శాస్త్రీయమని డాక్టర్ దుర్గ సునీల్వాస చెప్తున్నారు. ఈయన బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్)తోపాటు ఎంఎస్సీ మైక్రోబయాలజీ పూర్తి చేశారు. ఇంటిగ్రేటివ్ స్పెషలిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్గా కొనసాగుతున్నారు. అల్లోపతితోపాటు ఆయుర్వేదం తెలిసిన వైద్యుడిగా, రసాయన మిశ్రమాలు సూక్ష్మజీవుల గురించి తెలిసిన మైక్రోబయాలజిస్ట్గా తాను ఈ విషయాన్ని చెప్తున్నానన్నారు. ఆయుర్వేదంలోని ప్రతి ఔషధానికి శాస్త్రీయంగా రుజువులు ఉన్నాయని స్పష్టంచేశారు.
ఆయుర్వేదంలో కరోనాకు రెండురకాలుగా చికిత్స ఉన్నదని సునీల్ తెలిపారు. ముందస్తుగా ఔషధాన్ని అందించటం, సోకిన తర్వాత చికిత్స అందించడం. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక మనలోని టీఎంపీఆర్ఎస్ఎస్-2, ఏసీఈ-2 ఎంజైమ్ల సాయంతో ఇతర కణాలకు, అవయవాలకు వ్యాప్తి చెందుతున్నది. కాబట్టి వైరస్కు ఈ రెండు ఎంజైమ్లు అందకుండా, స్పైక్ ఏసీఈ-2 కాంప్లెక్స్ తయారుకాకుండా చేస్తే వైరస్ సోకే అవకాశం ఉండదని చెప్పారు. ఇందుకోసం అశ్వగంధ, తేనెటీగ లాలాజలం నుంచి తీసే ప్రొకోలిస్, ఇతర ఫైటో కెమికల్స్ ఉపయోగపడుతాయని తెలిపారు. అశ్వగంధలో ఉండే వితియోనిన్.. వైరస్ను అడ్డుకుంటుందన్నారు. తిప్పతీగలో ఉండే క్వెర్సిటిన్, కాంఫెరాల్ కూడా రోగనిరోధక వ్యవస్థను నియంత్రిస్తాయని వివరించారు.
కరోనా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ చికిత్సలో ఆయుర్వేద ఔషధాల పనితీరును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకొని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ఆయుర్వేద వైద్య నిపుణులు కోరుతున్నారు. అంతేకాకుండా కరోనా నివారణ కోసం అభివృద్ధి చేసిన ఔషధం ఇప్పటికీ వేల మందిని వైరస్ బారిన పడకుండా కాపాడుతున్నదని చెప్పారు. దీనిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి సరిహద్దు జిల్లాల్లో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సూపర్ స్ప్రెడర్స్కు అందజేయగలిగితే మంచి ఫలితం ఉంటుందని, థర్డ్ వేవ్ను సైతం నివారించే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.
కరోనా సోకినవారికి ఆయుర్వేద చికిత్సలో భాగంగా నిపుణులు క్వెర్సిటిన్, ల్యూటియోలిన్, ఎస్పిరిడిన్, నియో ఎస్పిరిడిన్, కాంఫెరాల్, రూటిన్, లెక్టిన్ వంటివి ఇస్తున్నట్టు సునీల్ తెలిపారు. ఇవన్నీ మొక్కల నుంచి సేకరించినవేనన్నారు. తెల్ల ఉల్లిగడ్డలో క్వెర్సిటిన్ ఉంటుందని, ట్యుటియోలిన్ కొత్తిమీరలో, నిమ్మజాతి చెట్లలో ఎస్పిరిడిన్, నియో ఎస్పిరిడిన్ ఉంటుందని, ఉసిరిలో ఉండే పైల్లాఎంబ్లసిన్ జీ-7 అనే ఫైటో కెమికల్ స్పైక్ ప్రొటీన్, ఏసీ ఈ-2 కాంప్లెక్స్ కాకుండా నిరోధిస్తుందని అన్నారు. సాధారణంగా వైరస్ సోకిన తర్వాత వాటిని ఎదుర్కొనేందుకు మన శరీరంలోని మాస్ట్ కణాలు యాక్టివేట్ అవుతున్నాయని, ఇవి రోగనిరోధక వ్యవస్థలో కీలకమైన హిస్టమిన్-1 (హెచ్-1), హిస్టమిన్-2ను (హెచ్-2) విడుదల చేస్తాయని చెప్పారు. కొన్నిసార్లు మన రోగనిరోధకశక్తి అతిగా స్పందించడం వల్ల సైటోకైన్ తుఫాన్కు దారితీసి శరీరంపై తిరుగబడుతున్నదని, దీంతో వ్యాధిని తగ్గించడానికి స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారన్నారు. ఆయుర్వేద ఔషధాల్లోని క్వెర్సిటిన్, ల్యూటియోలిన్.. మాస్ట్ కణాలను అదుపు చేస్తాయని, దీంతో రోగనిరోధకశక్తి తిరగబడే అవకాశం ఉండదన్నారు. వైరస్లోని స్పైక్ ప్రొటీన్పై కూడా ల్యూటియోలిన్ ప్రభావం చూపుతుందని తెలిపారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినవారికి కూడా ఆయుర్వేద చికిత్సతో తగ్గించవచ్చని స్పష్టంచేశారు.
ఆయుర్వేద చికిత్సలో అనేక యాంటిబయాటిక్స్ ఉన్నాయని సునీల్ పేర్కొన్నారు. ఇందులో బైకలిన్ను ఉత్తమమైనదని, ఇది ఓరోజైలం ఇండికం (మండుకపర్ణము), టెర్మినేలియా అర్జున (తెల్లమద్ది) అనే మొక్కల నుంచి సేకరిస్తారని తెలిపారు. ఇది యాంటివైరల్, యాంటిబ్యాక్టీరియాగా పనిచేయడంతోపాటు చర్మంపై మంటలు, దురదలను తగ్గిస్తుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సహా ఆనేక రాష్ర్టాల్లో ఆయుర్వేద విధానంలో కరోనాకు చికిత్స అందిస్తున్నారని, 90 ఏండ్ల వృద్ధులు కూడా విజయవంతంగా కోలుకున్నారని చెప్పారు. బీపీ, మధుమేహం వంటి ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి సైతం విజయవంతంగా చికిత్స అందించారన్నారు.