విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాండించేందుకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు.
గురువారం నుంచి ప్రారంభం కానున్న బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో 215 మందితో కూడిన భారత బృందం.. పతకాల వేట ప్రారంభించనుంది. గోల్డ్కోస్ట్ (2018)లో 66 పతకాలతో ఓవరాల్గా మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తున్నది. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా గాయం కారణంగా ఈ మెగాటోర్నీకి దూరం కాగా.. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ప్రారంభ వేడుకల్లో త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనుంది.
బర్మింగ్హామ్: అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్లు.. మరో మెగాటోర్నీకి సమాయత్తమయ్యారు. గురువారం నుంచి 12 రోజుల పాటు జరుగనున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు కొల్లగొట్టేందుకు మనవాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టారు. 2018లో గోల్డ్కోస్ట్ వేదికగా జరిగిన క్రీడల్లో 66 పతకాలు సాధించి ఓవరాల్గా మూడో స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి అంతకుమించిన ప్రదర్శన చేయాలని భావిస్తే.. నిర్వహకులు ఊహించని షాక్ ఇచ్చారు.
ఈ క్రీడల్లో భారత్కు పెట్టనికోట వంటి షూటింగ్ను.. క్రీడాంశాల నుంచి తొలగించడంతో మన పతకావకాశాలపై భారీ ప్రభావం పడనుంది. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఇప్పటి వరకు ఓవరాల్గా 503 పతకాలు సాధించగా.. అందులో అత్యధిక మెడల్స్ (135) షూటింగ్లోనే వచ్చాయి. బ్రిటన్ ముచ్చటగా మూడోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిస్తుండగా.. గురువారం అలెగ్జాండర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి.
కామన్వెల్త్లోని 72 సభ్య దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. ఇందులో 56 దేశాలు కాగా.. మిగిలిన 16 టెరిటరీస్ ఉన్నాయి. 1930 నుంచి ప్రారంభమైన ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 17 సార్లు పాల్గొంది. 2002 నుంచి నిలకడగా.. టాప్-5లో నిలుస్తూ వస్తున్న భారత్.. ఈసారి షూటింగ్ గైర్హాజరీలో సేమ్ సీన్ రిపీట్ చేస్తుందా చూడాలి!
బర్మింగ్హామ్ క్రీడల్లో షూటింగ్ లేకపోయినా.. వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్లో సత్తాచాటేందుకు మనవాళ్లు సిద్ధమవుతున్నారు. తొలిసారి కామన్వెల్త్లో మహిళల టీ20 క్రికెట్ను ప్రవేశ పట్టగా.. నీరజ్ చోప్రా గైర్హాజరీలో అథ్లెటిక్స్లో అవినాశ్, ద్యుతీచంద్, హిమదాస్, అన్నురాణి, ధనలక్ష్మి, శ్రీశంకర్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
రెజ్లింగ్లో 12 మంది పోటీలో ఉండగా.. 12 పతకాలు వచ్చే అవకాశాలున్నాయి. లిఫ్టింగ్లో మీరాబాయి చాను.. బ్యాడ్మింటన్లో పీవీ సింధు స్వర్ణాలు సాధించాలని తహతహలాడుతుంటే.. బాక్సింగ్లో లవ్లీనా బొర్గోహై, ప్రపంచ చాంపియన్ నిఖత జరీన్ బరిలోకి దిగుతున్నారు. ఒలింపిక్స్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన హాకీ జట్లు.. ఇక్కడ కూడా అదే తరహా ఆటతో ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాయి.
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ తొలిసారి కామన్వెల్త్ క్రీడల బరిలో దిగుతున్నది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఈ తెలంగాణ అమ్మాయి.. బర్మింగ్హామ్లో తన పంచ్ పవర్తో పసిడి పట్టాలని తహతహలాడుతుంటే.. ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్) తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
బాక్సింగ్లో హుసాముద్దీన్, బ్యాడ్మింటన్లో సుమీత్ రెడ్డి పతకాలు సాధించాలని చూస్తుంటే.. జాతీయ బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ తొలిసారి బరిలోకి దిగుతున్నది. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ కూడా బర్మింగ్హామ్ చేరుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్లో.. భారత బృందానికి స్టార్ షట్లర్ సింధు ఫ్లాగ్బేరర్గా వ్యవహరించనుంది. అలెగ్జాండర్ స్టేడియంలో జరుగనున్న వేడుకల్లో సింధు త్రివర్ణ పతాకం చేబూని ముందు నడువనుంది. వాస్తవానికి ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా పతాకధారిగా వ్యవహరించాల్సి ఉండగా.. గాయం కారణంగా అతడు క్రీడల నుంచి తప్పుకోవడంతో ఈ అవకాశం తెలుగమ్మాయికి దక్కింది.
3 కామన్వెల్త్ క్రీడలకు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1934లో లండన్లో తొలిసారి ఈ క్రీడలు జరుగగా.. ఆ తర్వాత 2002 గేమ్స్కు మాంచెస్టర్ వేదికగా నిలిచింది.
ప్రత్యక్ష ప్రసారం సోనీ టెన్ 1, డీడీ స్పోర్ట్స్ రాత్రి 11:30 నుంచి