Ravichandran Ashwin | ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ను తుది జట్టులోకి తీసుకోకుండా.. బెంచ్పై కూర్చోబెట్టడం కంటే కఠిన నిర్ణయం మరొకటి ఉండదని.. టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. అయితే జట్టు నిర్ణయాన్ని శిరసావహించడంలో అశ్విన్ ఆరితేరాడని మాంబ్రే పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగాలనేది అత్యంత ముఖ్యమని.. అలాంటి సమయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పారస్ వెల్లడించాడు.
‘వరల్డ్కప్లో తుది జట్టు ఎంపిక అంటే ఆషామాషీ కాదు. అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్కు అవకాశం ఇవ్వకుండా బయట కూర్చోబెట్టడం కష్టంతో కూడుకున్న నిర్ణయం. ఇలాంటివి తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా వన్డే ప్రపంచకప్లో తొలి మ్యాచ్ అనంతరం మిగిలిన రెండు మ్యాచ్ల్లో అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ అశ్విన్లో మాత్రం ఎలాంటి అసహనం కనిపించలేదు. అతడు జట్టు మనిషి. టీమ్ విజయం కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు’ అని మాంబ్రే పేర్కొన్నాడు.
ఇక వన్డే వరల్డ్ కప్ జట్టు ఊహల్లో కూడా లేని అశ్విన్కు అనుకోకుండా అవకాశం దక్కింది. చాన్నాళ్లుగా టెస్టు క్రికెట్కే పరిమితమవుతున్న ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్కు వరల్డ్కప్ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది. మరో ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయ పడటంతో అనివార్య పరిస్థితుల్లో అశ్విన్కు సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఇక మెగాటోర్నీ ప్రారంభమైన తర్వాత తొలి పోరులో చెన్నై వేదికగా జరగడంతో ఆ మైదానంలో అపార అనుభవం ఉండటంతో పాటు.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కింది. ఆ తర్వాత.. టీమ్ఇండియా ఆడిన రెండు మ్యాచ్ల్లో అశ్విన్ స్థానంలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పారస్ పై వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్లో కోపం, అసంతృప్తి ఛాయలు ఏమాత్రం లేవని.. అతడో చాంపియన్ బౌలర్ అని మాంబ్రే కొనియాడాడు.