జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న తెలంగాణ ప్లేయర్లకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించి రేపటి తరాలను శారీరకంగా, మానసికంగా ధృడంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి, ప్రతిష్టలు తీసుకొచ్చిన నిఖత్ జరీన్, ఇషాసింగ్ను చూసి యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. విశ్వక్రీడా వేదికలపై తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేసిన నిఖత్, ఇషాను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టోర్నీల్లో పసిడి పతకాలతో మెరిసిన రాష్ట్ర స్టార్ ప్లేయర్లు నిఖత్ జరీన్, ఇషాసింగ్కు తగిన గుర్తింపు లభించింది. టర్కీ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఇందూరు బాక్సర్ నిఖత్ పసిడి వెలుగులు విరజిమ్మింది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ అప్రతిహత విజయాలతో పసిడి పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో ఇషాసింగ్ హ్యాట్రిక్ స్వర్ణాలతో సత్తాచాటింది.
ప్రపంచ వేదికలపై దేశ ఖ్యాతిని ద్విగుణీకృతం చేసిన నిఖత్, జరీన్కు సొంతగడ్డపై కనివినీ ఎరుగని రీతిలో స్వాగత సత్కారాలు లభించాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఇద్దరు ప్లేయర్లను ఘనంగా సన్మానించారు. అంతకుముందు పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన వేడుకల్లో చెరో రూ.2 కోట్ల నజరానా అందించారు. అనంతరం వారి తల్లిదండ్రులను ప్రగతిభవన్కు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి సీఎం భోజనం చేశారు.
ఈ సందర్భంగా వారితో కాసేపు మాట్లాడారు. బాక్సింగ్ క్రీడపై చిన్నతనం నుంచే మకువ చూపించడానికి గల కారణాలు, గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్ జరీన్ను సీఎం అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ, ప్రోత్సాహాన్ని నిఖత్ సీఎంకు వివరించింది. తాను బాక్సింగ్లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఆత్మైస్థెర్యాన్ని నింపిందని ఈ సందర్భంగా నిఖత్ ఆనందం వ్యక్తం చేసింది. కీలక సమయంలో అన్ని విధాలా సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా యువ బాక్సర్ పట్టుదల, ఆత్మైస్థెర్యాన్ని సీఎం అభినందించారు.
జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన ఇషాసింగ్తో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. చిన్నతనంలోనే షూటింగ్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్నావంటూ అభినందించారు. బిడ్డను గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఇషా తల్లిదండ్రులు సచిన్ సింగ్, శ్రీలతను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు.
దాదాపు గంట పాటు క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక ఆతిథ్యం ఇచ్చిన సీఎం కేసీఆర్, శోభ దంపతులు వారిని ఘనంగా సన్మానించిన అనంతరం గౌరవ ప్రదమైన వీడోలు పలికారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యే గణేశ్గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2014 స్వాతంత్య్ర వేడుకల్లో తనకు నగదు బహుమతిగా రూ.50 లక్షల చెకు అందించి, తన అభ్యర్థన మేరకు బాక్సింగ్ ఫోజు ఇచ్చిన విషయాన్ని సీఎం కేసీఆర్కు నిఖత్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ‘సార్ మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆనాటి మాదిరి బాక్సింగ్ పిడికిలి బిగించండి..’ అని సీఎంను నిఖత్ కోరింది.
పట్టుబట్టి విశ్వ విజేతగా నిలిచిన నిఖత్ పట్టుదలకు, బాక్సింగ్ బరిలో ఆమె చూపిన ప్రతిభను మెచ్చుకున్న సీఎం కేసీఆర్ పిడికిలి బిగించి చిరునవ్వుతో ఆమెను అనుకరించారు. ఈ సందర్భంగా అకడ నవ్వులు వెల్లి విరిసాయి. తన అభ్యర్థనను మన్నించినందుకు సీఎంకు నిఖత్ ధన్యవాదాలు తెలిపింది. తమ బిడ్డను ప్రోత్సహించి పసిడి పతకం సాధించేందుకు దోహదపడటమే కాకుండా, రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు నిఖత్ జరీన్ తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా..సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.