Agasara Nandini | తెలంగాణ క్రీడా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ.. ఆసియా క్రీడల్లో గురుకుల అథ్లెట్ అగసర నందిని కంచు మోత మోగించింది! కాళ్లకు చెప్పులు కూడా లేని కటిక పేదరికాన్ని అనుభవించిన ఆ అమ్మాయి.. నేడు ఏషియన్ గేమ్స్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది! అథ్లెటిక్స్లోనే అత్యంత కష్టమైన హెప్టాథ్లాన్లో కాంస్య పతకం నెగ్గి తెలంగాణతో పాటు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. మువ్వన్నెల రెపరెపల ముందు ఏ సంతోషమైనా చిన్నదే అని చెప్పి చైనాలో అడుగుపెట్టిన నందిని.. కాంస్యంతో తన మాట నిలబెట్టుకుంది!
తెలంగాణ తారలు తళుక్కుమన్నవేళ.. ఆసియాక్రీడల చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పోటీల ఎనిమిదో రోజు ఏకంగా 15 పతకాలతో దుమ్మురేపింది. ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్య పతకంతో మెరవగా.. హైదరాబాదీ షూటర్ కైనన్ చెనాయ్ డబుల్ ధమాకా మోగించాడు. 300 మీటర్ల స్టీపుల్ చేజ్లో అవినాశ్ స్వర్ణ కాంతులు విరజిమ్మితే.. షాట్పుట్ బాహుబలి తజిందర్ వరుసగా రెండోసారి పసిడి పతకం పట్టేశాడు. పురుషుల షూటింగ్ ట్రాప్ ఈవెంట్లో బంగారు పతకం ఖాతాలో చేరగా.. గోల్ఫ్లో అదితి రజతం కైవసం చేసుకుంది. మహిళల, పురుషుల 1500 మీటర్ల పరుగులో వరుసగా హర్మిలాన్, అజయ్ వెండి పతకాలు చేజిక్కించుకోగా.. తెలుగమ్మాయి జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.ఫలితంగా ఎనిమిదో రోజు భారత్ పతకాల సంఖ్య హాఫ్సెంచరీ దాటింది.
హాంగ్జౌ: చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5712 పాయింట్లతో నందిని మూడో స్థానంలో నిలిచింది. తద్వారా తెలంగాణ నుంచి అథ్లెటిక్స్లో పతకం గెలిచి దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అథ్లెటిక్స్లో రాటుదేలిన నందిని మరోసారి చాంపియన్ అనిపించుకుంది. నందిని ప్రస్తుతం సంగారెడ్డి గురుకుల కళాశాళలో బీబీఏ రెండో ఏడాది చదువుతోంది.ఆదివారం పోటీలు ముగిసే సరికి భారత్ 53 పతకా(13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలు)తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తెలంగాణ ప్లేయర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. బాక్సింగ్లో నిఖత్ జరీన్, అథ్లెటిక్స్లో అగసర నందిని కాంస్య పతకాలు సాధించడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు బిడ్డలు రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని కొనియాడారు. గురుకులాలు ఇప్పటికే విద్యారంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుండగా.. ఏషియన్ గేమ్స్లోనూ మన విద్యార్థులు మెరవడం గొప్ప విషయమని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ ప్లేయర్లు పతకాలు నెగ్గి దేశానికే వన్నె తేవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా అభినందించారు. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో నిఖత్ 50 కేజీల విభాగంలో కాంస్య పతకం నెగ్గడంతో ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇందూరు బిడ్డ మరోసారి సత్తాచాటింది. తెలంగాణతో పాటు దేశం గర్వపడే ప్రదర్శనతో ఆకట్టుకుంది’ అని కవిత ట్వీట్ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకున్న తెలంగాణ గురుకుల విద్యార్థిని అగసర నందినిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎస్సీ కార్పొరేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ నవీన్ నికోలస్, సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ అభినందించారు.
భారత షూటర్లు మరోసారి పతకాల పంట పండించారు. మెన్స్ ట్రాప్లో కైనన్ చెనాయ్, జొరావర్ సింగ్ సంధు, పృథ్వీరాజ్ తొండైమన్ త్రయం పసిడి పతకం కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈ ముగ్గురు 361 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా షూటింగ్లో భారత్కు ఇది ఏడో స్వర్ణం కావడం విశేషం. పురుషుల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్లో హైదరాబాద్కు చెందిన కైనన్ చెనాయ్ కాంస్య పతకంతో మెరిశాడు.
పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ ఆసియా గేమ్స్లో తొలిసారి పతకాన్ని ముద్దాడింది. తృటిలో పసిడి చేజారడంతో వెండి పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో చైనా చేతిలో 3-2తో ఓటమి పాలైంది. గాయంతో లక్ష్యసేన్ టైటిల్ పోరుకు దూరం కావడం భారత అవకాశాల్ని దెబ్బతీసింది. అయినా కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చివరిదాకా పోరాడారు. కానీ, చైనా టీమ్ అద్భుత ఆటతో స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది.
రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో ఫేవరెట్గా బరిలోకి దిగిన నిఖత్ సెమీఫైనల్లో థాయ్లాండ్కు చెందిన రక్సత్ చుథామట్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. తొలిరౌండ్లో 3-2తో ఆధిక్యంలో ఉన్న జరీన్ రెండో రౌండ్లో వెనకబడింది. మూడోరౌండ్లో అంపైర్ నిర్ణయంతో రక్సత్ ఫైనల్కు చేరింది. దాంతో, ఇందూరు బిడ్డ కాంస్య పతకం సొంతం చేసుకుంది.
లాంగ్ జంప్లో మురళీ శ్రీ శంకర్ రికార్డులు తిరగరాశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 8.19 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. దాంతో, 45 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్లో పతకం గెలిచిన లాంగ్ జంపర్గా శంకర్ సంచలనం సృష్టించాడు. మరో భారత అథ్లెట్ జెస్విన్ అల్డ్రిన్ 8వ స్థానానికి పరిమితమయ్యాడు. చైనాకు చెందిన వాంగ జియానన్ 8.22 మీటర్ల జంప్తో స్వర్ణం నెగ్గాడు.
టోక్యో ఒలింపిక్స్లో పతకం చేజార్చుకున్న యంగ్ గోల్ఫర్ ఆదితి అశోక్ ఆసియా క్రీడల్లోఅదరగొట్టింది. మహిళల విభాగంలో నాలుగు రౌండ్ల తర్వాత17- అండర్ 271తో రెండో స్థానంలో నిలిచి వెండి పతకం దక్కించుకుంది. తద్వారా ఈ పోటీలో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా అదితి రికార్డు నెలకొల్పింది.
పురుషుల 1,500 మీటర్ల పరుగులో అజయ్ కుమార్ సరోజి వెండి, జిన్సన్ జాన్సన్ కాంస్య పతకాలతో మెరిశారు. మహిళల 1,500 మీటర్ల రేసులో హర్మిలాన్ బైన్స్ వెండి పతకం కొల్లగొట్టింది. ఇక.. డిస్కస్ త్రోలో సీమా పూనియా అంచనాలు అందుకోలేకపోయింది. ఫైనల్లో 58.62 మీటర్ల దూరం విసిరి కాంస్యం సొంతం చేసుకుంది. బాక్సర్ ప్రవీణ్ హుడా 57కిలోల విభాగంలో సెమీస్ చేరడంతో పాటు పారిస్ ఒలింపిక్స్ బెర్త్త్ ఖరారు చేసుకున్నాడు.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో తెలుగు తేజం జ్యోతి ఎర్రోజు వెండి పతకంతో సత్తా చాటింది. అయితే.. రేసుకు ముందు హైడ్రామా నెలకొంది. స్టార్టింగ్ సిగ్నల్ కంటే ముందే పరుగెత్తారనే నెపంతో చైనా అథ్లెట్ యన్ని వూతో పాటు జ్యోతిని అధికారులు పక్కన నిల్చోమన్నారు. దాంతో, వూ, జ్యోతి అధికారులతో వాగ్వాదానికి దిగడంతో రేసు కాసేపు నిలిచిపోయింది. రిప్లేలో జ్యోతి చేతులు నేలకు ఆనించి ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత మొదలైన రేసులో వూ రెండు, జ్యోతి 12.91 సెకన్లతో మూడో స్థానంలో నిలిచారు. కానీ, ఫౌల్ మరోసారి ఫౌల్కు పాల్పడడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో అనూహ్యంగా జ్యోతికి వెండి దక్కింది.
అథ్లెటిక్స్లో అవినాష్ సబ్లే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 3 వేల మీటర్ల స్టీపుల్చేజ్లో గోల్డ్ మెడల్తో దేశం గర్వించేలా చేశాడు. 8ః19.50 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి అదరహో అనిపించాడు. గతంలో ఇరాన్ అథ్లెట్ హొసేన్ కియానీ పేరిట ఉన్న 8ః22.50 రికార్డును బద్ధలు కొట్టాడు. అంతేకాదు. స్టీపుల్ చేజ్లో పతకం గెలిచిన తొలి భారతీయుడిగా అవినాష్ గుర్తింపు సాధించాడు.
డిఫెండింగ్ చాంపియన్ తజిందర్ పాల్ సింగ్ తూర్ అంచనాలను అందుకుంటూ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఈ బాహుబలి షాట్పుట్ ఫైనల్లో ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరాడు. దాంతో, వరుసగా రెండోసారి పసిడి పతకం నిలబెట్టుకున్నాడు. 2018లో జకార్తాలో తజిందర్ షాట్పుట్ను 20.75 మీటర్ల రికార్డు దూరం విసిరి స్వర్ణం గెలిచాడు.
అథ్లెటిక్స్: పురుషుల డెక్లాథ్లాన్-తేజస్విన్ శంకర్, మహిళల లాంగ్ జంప్-శైలీసింగ్, మహిళల 300 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఫైనల్ – ప్రీతి, పారుల్ చౌదరి, 4X400 మీటర్ల మిక్స్డ్ ఫైనల్
ఆర్చరీ: పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్
హాకీ: భారత్ X బంగ్లాదేశ్
కబడ్డీ: భారత్ X చైనీస్ తైపీ
టీటీ: మహిళల డబుల్స్ సెమీస్- సుతీర్థ-ఐహిక