సెయింట్ లూసియా: వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 14 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా అతడు నిలిచాడు. 41 ఏళ్ల వయసులోనూ ఈ ఇన్స్టాంట్ క్రికెట్లో ఈ యూనివర్స్ బాస్ చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో గేల్ ఈ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అది కూడా తనదైన స్టైల్లో ఓ సిక్స్తో ఈ 14 వేల మైల్స్టోన్ను అందుకున్నాడు. గేల్ ఇప్పటి వరకూ 431 టీ20 మ్యాచ్లు ఆడాడు. గేల్ తర్వాత మరో వెస్టిండీస్ బ్యాట్స్మన్ కైరన్ పొలార్డ్ 545 మ్యాచ్లు ఆడి 10836 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్లో 142 పరుగుల లక్ష్యంతో దిగిన విండీస్.. గేల్ హాఫ్ సెంచరీతో ఈ మ్యాచ్లో సునాయాస విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో గెలుచుకుంది. ఇక 2016 తర్వాత టీ20ల్లో గేల్ సాధించిన తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లో వరుసగా మూడు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ చేశాడు గేల్. కేవలం 38 బంతుల్లోనే 67 పరుగులు చేసిన గేల్.. 7 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. దీంతో విండీస్ కేవలం 14.5 ఓవర్లలోనే టార్గెట్ చేజ్ చేసింది.