ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసేందుకు మాజీ భారత పేసర్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ కూడా ఐర్లాండ్ వెళ్తున్నట్లు సమాచారం.
డబ్లిన్ వేదికగా జరిగే రెండు టీ20ల సిరీస్లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ త్రిపాఠీకి ఈ సిరీస్లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. అలాగే గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సిరీస్లో ఆడనున్నాడు.
టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేయాల్సిన స్థితిలో.. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఈ సిరీస్ చూసేందుకు వెళ్లడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, బుమ్రా, జడేజా, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు దాదాపుగా టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఉంటారని అందరికీ తెలుసు.
ఈ క్రమంలో మిగతా ఆటగాళ్ల కోసం సెలెక్టర్లు యువ ఆటగాళ్లను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయడానికే చేతన్ శర్మ వెళ్తున్నాడని, మంచి ప్రదర్శన చేసిన వాళ్లకు టీ20 ప్రపంచకప్లో ఆడే అవకాశం దక్కొచ్చని క్రీడాభిమానులు భావిస్తున్నారు.