Cheteshwar Pujara | ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా దేశవాళీల్లో దుమ్మురేపుతున్నాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన పుజారా (278 బంతుల్లో 133; 14 ఫోర్లు, ఒక సిక్సర్) సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సహచరులంతా పెవిలియన్కు క్యూ కట్టిన సమయంలో తనకు అలవాటైన శైలిలో పుజారా క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టాడు.
సెంట్రల్ జోన్తో జరుగుతున్న పోరులో ఓవర్నైట్ స్కోరు 149/3తో మూడో రోజు శుక్రవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్జోన్.. ఆట ముగిసే సమయానికి 292/9తో నిలిచింది. చివరి బంతిని పుజారా రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీ అనంతరం వెనుదిరగగా.. సర్ఫరాజ్ ఖాన్ (6) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కింది వరుస బ్యాటర్లతో కలిసి పుజారా జట్టుకు విలువైన పరుగులు అందించాడు.
పుజారా అసమాన పోరాటంతో వెస్ట్ జోన్ 384 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులు చేయగా.. సెంట్రల్ జోన్ 128 రన్స్కే ఆలౌటైంది. WTC ఫైనల్ ప్రదర్శనతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం పుజారాను జట్టు నుంచి తప్పించిన సెలెక్టర్లు.. అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడనుండగా.. దశాబ్ద కాలంగా పుజారా బరిలోకిదిగిన వన్డౌన్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.