ముంబై: చెస్ టోర్నీ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు తనను వేధింపులకు గురి చేసినట్లు భారతీయ చెస్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్(Chess Player Divya Deshmukh) ఆరోపించారు. ఇటీవల నెదర్లాండ్స్లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో ఈ ఘటన జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. చెస్ టోర్నీ వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆట మీద ధ్యాస కన్నా.. తన కురులు, దుస్తులు, మాటతీరుపైనే ఫోకస్ పెట్టారని దివ్య ఆరోపించారు. నాగపూర్కు చెందిన 18 ఏళ్ల అంతర్జాతీయ మాస్టర్ ప్లేయర్ దివ్య.. గత ఏడాది ఏషియన్ వుమెన్స్ చెస్ చాంపియన్షిప్ గెలుచుకున్నది. తాజాగా సోషల్ మీడియా అకౌంట్లో తనకు ఎదురైన వేధింపుల గురించి ఆ పోస్టులో రాశారు. చెస్ ఆడే మహిళా క్రీడాకారిణిలను ప్రేక్షకులు ఎలా చూస్తారన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నట్లు తన పోస్టులో ఆమె పేర్కొన్నారు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీలో 4.5 స్కోర్తో ఛాలెంజర్స్ సెక్షన్లో దివ్య దేశ్ముక్ 12వ స్థానంలో నిలిచారు.తన గేమ్ గురించి ఎవరూ మాట్లాడడం లేదని, కేవలం తన అందం గురించే ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నట్లు తెలిసిందన్నారు. చెస్ క్రీడలో పురుషులకు తగిన స్థాయిలో మహిళలకు కూడా గౌరవం దక్కాలని ఆమె అన్నారు.