స్వదేశంలో తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు సత్తాచాటాయి. ఓపెన్ కేటగిరీలో భారత్-‘బి’ కాంస్య పతకంతో మెరువగా.. మహిళల విభాగంలో భారత్-‘ఎ’ కంచు మోత మోగించింది. ఆఖరి రౌండ్లో జర్మనీని చిత్తుచేసిన భారత్-‘బి’ మూడో స్థానంతో పోటీలను ముగిస్తే.. చివరి వరకు స్వర్ణంపై ఆశలు రేపిన కోనేరు హంపి బృందం ఆఖరి పోరులో అమెరికా చేతిలో ఓడి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
మహాబలిపురం: చదరంగ చరిత్రలో తొలిసారి టార్చ్ రిలే నిర్వహించి.. సొంతగడ్డపై భారీ ఏర్పాట్ల మధ్య సాగిన 44వ చెస్ ఒలింపియాడ్ అట్టహాసంగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక జట్లు పాల్గొన్న ఈ మెగాటోర్నీలో మన గ్రాండ్మాస్టర్లు రెండు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ఓపెన్ కేటగిరీలో భారత్-‘బి’ కాంస్య పతకం కైవసం చేసుకోగా.. మహిళల ఈవెంట్లో భారత్-‘ఎ’ కాంస్యం చేజిక్కించుకుంది. మంగళవారం జరినగి ఓపెన్ ఆఖరి రౌండ్లో భారత్-‘బి’ 3-1తో జర్మనీని చిత్తుచేసి మూడో స్థానంలో నిలిచింది. తొలి గేమ్ను గుకేశ్ ‘డ్రా’ చేసుకోగా.. నిహాల్ సరీన్ మొదటి విజయం నమోదు చేశాడు.
మూడో గేమ్ను ప్రజ్ఞానంద ‘డ్రా’గా ముగించగా.. ఆఖరి పోరులో సాధ్వాని గెలుపొందాడు. మొత్తం 11 రౌండ్లలో 18 పాయింట్లు సాధించిన మన గ్రాండ్మాస్టర్లు మూడో ప్లేస్తో పోటీలను ముగించారు. రష్యా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్ స్వర్ణ పతకం నెగ్గగా.. అర్మేనియా రజతం కైవసం చేసుకుంది. ఈ కేటగిరీలో భారత్కు కాంస్యం దక్కడం రెండోసారి.. 2014లో భారత్ తొలిసారి కంచు మోత మోగించింది. ఇదే విభాగంలో పోటీ పడ్డ భారత్-‘ఎ’ 17 పాయింట్లతో నాలుగో ప్లేస్లో నిలిచింది.
హంపి బృందానికి కాంస్యం
పది రౌండ్లు ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణంపై ఆశలు రేపిన భారత మహిళల జట్టు.. చివరి పోరులో తడబడింది. మంగళవారం అమెరికాతో జరిగిన మ్యాచ్లో మన అమ్మాయిలు 1-3తో ఓటమి పాలయ్యారు. ఫలితంగా 17 పాయింట్లకు పరిమితమైన భారత్-‘ఎ’ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఉక్రెయిన్, జార్జియా వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు. తెలుగు గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకోగా.. అదే బాటలో నడుస్తూ.. వైశాలి రెండో గేమ్ను సమం చేసుకుంది. ఈ దశలో ఓత్తిడిలో పడ్డ మన అమ్మాయిలు ఆ తర్వాత అమెరికాకు పోటీనివ్వలేకపోయారు. తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి వరుసగా ఓటమి పాలవడంతో భారత్కు నిరాశ తప్పలేదు. ఇదే విభాగంలో పోటీ పడ్డ భారత్-‘బి’ 16 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది.
అర్జున్ @ 2700
తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరగైసి 2700 ఎలో రేటింగ్ మార్క్ అధిగమించాడు. తాజా మెగాటోర్నీలో భారత్-‘ఎ’ తరఫున బరిలోకి దిగిన అర్జున్.. అమెరికా గ్రాండ్మాస్టర్ పెరెజ్పై విజయంతో ఈ ఘనత సాధించడంతో పాటు ఈ మార్క్ దాటిన ఏడో భారత గ్రాండ్మాస్టర్గా నిలిచాడు. 18 ఏండ్ల అర్జున్ ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
చెస్ పతక విజేతలు