BBL : ఐపీఎల్ సందడి ముగిసిన తర్వాత చెన్నై వేదికగా మరో టీ20 లీగ్ అభిమానులను అలరించనుంది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్బాష్ లీగ్(BBL)ను తొలిసారి భారత గడ్డపై నిర్వహించనున్నారు. ఈమేరకు క్రికెట్ ఆస్ట్రేలియా, భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI), తమిళనాడు క్రికెట్ సంఘం(TNCA) మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూడింటి మధ్య ఒక ఒప్పందం కుదరనుంది. చెన్నై చెపాక్ స్టేడియంలో డిసెంబర్ 12 బీబీఎల్ మ్యాచ్ ఆడిస్తారని సమాచారం. అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా, టీఎన్సీఏ అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య కొన్ని కార్యక్రమాల మార్పిడి ఒప్పందం ఉంది. అందులో భాగంగానే ఇండియాలో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. చెన్నైలో వసతులు, పరిస్థితుల్ని స్వయంగా చూసి తెలుసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా, బీబీఎల్ బృందం ఈ మధ్యే భారత్కు వచ్చింది. సోమవారం చిదంబరం స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ, ప్రేక్షకుల ఆదరణ వంటి విషయాలను ఆ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మిన్హస్, తాత్కాలిక సీఈఓ హేమంగ్ అమిన్లు సైతం హాజరయ్యారు.
🚨 BBL in Chennai 🚨
Chepauk Stadium will host a Big Bash match in the second week of December pic.twitter.com/xjyXLHUQnw
— CricInformer (@CricInformer) May 18, 2026
‘చెన్నైలో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణపై క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి రెండు వారాల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సోమవారం చెపాక్లో సన్రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ను ఆ దేశ బోర్డు సభ్యులు, బీబీఎల్ బృందంతో పాటు వీక్షించారు. త్వరలోనే పూర్తి సమాచారంతో తిరిగొస్తామని వారు చెప్పారు. బీబీఎల్ మ్యాచ్ నిర్వహించడంలో మాకు ఇబ్బందేమీ లేదు. ఈ విషయంలో బీసీసీఐ ఆత్మవిశ్వాసంతో ఉంది. సో.. మేము తుది అనుమతులు కోసం ఎదురుచూస్తున్నాం’ అని క్రిక్బజ్తో టీఎన్సీఏ అధికారి ఒకరు తెలిపారు. అన్నీ కుదిరితే డిసెంబర్ 12న చెపాక్లో బీబీఎల్ మ్యాచ్ జరుగనుందని విశ్వసనీయ సమాచారం.