ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ హవా కొనసాగుతున్నది. సొంతగడ్డపై తమకు తిరుగు లేదన్న రీతిలో ప్రత్యర్థులను పడగొడుతున్నది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో మినహాయిస్తే.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో తొలుత రైజర్స్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ధోనీసేన..కాన్వె, రుతురాజ్ దంచుడుతో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోగా, సన్రైజర్స్ వరుసగా రెండో ఓటమితో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నది.
చెన్నై : ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్తో పోరులో చెన్నై సూపర్కింగ్స్ ఏకపక్ష ప్రదర్శనతో అదరగొట్టింది. సొంత ఇలాఖాలో అశేష అభిమానుల మద్దతు మధ్య సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుగా ఓడించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. తొలుత రవీంద్ర జడేజా(3/22) ధాటికి హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 134/7 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్ అభిషేక్(34) మినహా మిగతా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనలోచెన్నై 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వె( 57 బంతుల్లో 77 నాటౌట్, 12 ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడు. మయాంక్ మార్కండే(2/23) రెండు వికెట్లు తీశాడు. మూడు వికెట్లతో హైదరాబాద్ పతనాన్ని శాసించిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. శనివారం ఐపీఎల్లో డబుల్ ధమాకా ప్రేక్షకులను అలరించనుంది. లక్నో-గుజరాత్, ముంబై-పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి.
జడ్డూ జాదూ
తొలుత టాస్ గెలిచిన ధోనీ..ఏమాత్రం సందేహం లేకుండా లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా చెన్నై బౌలర్లు రాణించారు. ఓపెనర్లు అభిషేక్శర్మ, హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్ను మందకొడిగా మొదలుపెట్టారు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వరుస బౌండరీలతో ఒకింత దూకుడు మీద కనిపించిన బ్రూక్ను ఆకాశ్సింగ్ తొలి వికెట్గా పెవిలియన్కు పంపాడు. షాట్ ఆడే క్రమంలో రుతురాజ్కు క్యాచ్ ఇచ్చి బ్రూక్ నిష్క్రమించాడు. ఇక్కణ్నుంచి హైదరాబాద్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. జడేజా రంగప్రవేశంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. తన తొలి ఓవర్లో ఏడు పరుగులే ఇచ్చుకున్న జడ్డూ..ఆ తర్వాత ఓవర్లో అభిషేక్ను ఔట్ చేశాడు. ఇక అప్పటి వరకు బౌండరీలతో దూకుడు కనబరిచిన రాహుల్ త్రిపాఠి(21) కూడా జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు. మరో ఎండ్లో మహేశ్ తీక్షణ..కెప్టెన్ మార్క్మ్న్రు బుట్టలో వేసుకుని మ్యాచ్ను తమ వైపు లాగేసుకున్నారు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 14 ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన మయాంక్ అగర్వాల్(2) ధోనీ స్టంపింగ్తో ఐదో వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో మార్కో జాన్సెన్(17 నాటౌట్) దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినా..మరో ఎండ్లో సహకారం లేకపోవడంతో భారీ స్కోరు సాధ్యపడలేదు. మొత్తంగా పిచ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ జడేజా..హైదరాబాద్ బ్యాటింగ్ను కుప్పకూల్చాడు.
కాన్వె ధమాకా
స్వల్ప లక్ష్యఛేదనను చెన్నై తమదైన శైలిలో మొదలుపెట్టింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వె ఆది నుంచే రైజర్స్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. మంచి ఫామ్మీదున్న వీరిద్దరు చెత్త షాట్లకు పోకుండా నింపాదిగా బౌండరీలు బాదుతూ లక్ష్యాన్ని అంతకంతకూ తగ్గించారు. వీరిద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్టేడియం హోరెత్తిపోయింది. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక భారీ సిక్స్తో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి చెన్నై 60 పరుగులతో విజయానికి చేరువైంది. అయితే ఇమ్రాన్ మాలిక్ వేసిన 11వ ఓవర్లో కాన్వె కొట్టిన షాట్ నేరుగా వికెట్లకు తాకడంతో రుతురాజ్ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్పడింది. రహానే(9), రాయుడు(9) నిరాశపర్చగా, అలీ(6 నాటౌట్)తో కలిసి కాన్వె గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో కాన్వె అజేయ అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
208
చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ధోనీ కొత్త చరిత్ర లిఖించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్(208)లు అందుకున్న వికెట్కీపర్గా నిలిచాడు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్(207) రికార్డును ధోనీ అధిగమించాడు. దినేశ్ కార్తీక్(205) మూడో స్థానంలో ఉన్నాడు.
4-0
చెపాక్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్పై చెన్నైకి ఇది నాలుగో విజయం. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో చెన్నైనే గెలుపు వరించింది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్ : 20 ఓవర్లలో 134/7(అభిషేక్శర్మ 34, రాహుల్ 21, జడేజా 3/22, ఆకాశ్సింగ్ 1/17),
చెన్నై: 18.4 ఓవర్లలో 138/3(కాన్వె 77 నాటౌట్, రుతురాజ్ 35, మయాంక్ 2/23)