మొనగాళ్ల పోరులో ధోనీ సేనను విజయం వరించింది. కట్టుదిట్టమైన బౌలింగ్లో మొదట ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన చెన్నై.. ఆనక బ్యాటింగ్లో అదరగొట్టింది. టెస్టు ప్లేయర్గా ముద్రపడ్డ రహానే వీరవిహారం చేయడంతో చెన్నై రెండో విజయం నమోదు చేసుకుంది.
ముంబై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య జరిగిన పోరులో చెన్నైదే పైచేయి అయింది. డబుల్హెడర్లో భాగంగా శనివారం రెండో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32; 5 ఫోర్లు), టిమ్ డేవిడ్ (31; ఒక ఫోర్, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (22), రోహిత్ శర్మ (21) తలా కొన్ని పరుగులు చేశారు.
చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 తుషార్ దేశ్పాండే, మిషెల్ శాంట్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అజింక్యా రహానే (27 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సునామీలా విరుచుకుపడగా.. రుతురాజ్ గైక్వాడ్ (40 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్), శివమ్ దూబే (28; 2 ఫోర్లు, ఒక సిక్సర్), అంబటి రాయుడు (20 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ముంబై బౌలర్లలో బెహ్రన్డార్ఫ్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ పడగొట్టారు. జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా ఆదివారం జరుగనున్న డబుల్ హెడర్లో గుజరాత్తో కోలక్తా, పంజాబ్తో హైదరాబాద్ తలపడనున్నాయి.
అజింక్యా అదుర్స్
వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన రహానే వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారించాడు. అర్శద్ వేసిన నాలుగో ఓవర్లో 6,4,4,4,4 దంచిన రహనే.. పియూష్ చావ్లా బౌలింగ్లో మరో రెండు ఫోర్లతో 19 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్16వ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 157/8 (ఇషాన్ 32, టిమ్ డేవిడ్ 31; జడేజా 3/20), చెన్నై: 18.1 ఓవర్లలో 159/3 (రహానే 61, రుతురాజ్ 40*; బెహ్రన్డార్ఫ్ 1/24).