చెన్నై: ఐపీఎల్లో లీగ్ దశ చివరి దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ బరిలోకి దిగుతాడా? అనే విషయంపై సస్పెన్స్ పెరుగుతోంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే తొడ కండరాల గాయానికి గురైన 44 ఏండ్ల ధోనీ చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్లో పాల్గొంటున్నా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సోమవారం చెపాక్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో సొంతగడ్డపై తలపడనున్న చెన్నై గురువారం గుజరాత్ టైటాన్స్తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
ఈ సీజన్లో చెన్నై వేదికగా జరిగే చివరి పోరు కాబట్టి.. సన్రైజర్స్పై ధోనీ సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రముఖ కామెంటేటర్ హర్ష్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. దాంతో పాటు ఐపీఎల్లో ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అవుతుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. మహీ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ను చెన్నైలోనే ఆడతాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో రైజర్స్తో మ్యాచ్లో మహీ బరిలోకి దిగి ఆటకు పూర్తిగా వీడ్కోలు చెబుతాడా? లేక ఎప్పట్లానే ఈ విషయంపై సస్పెన్స్ను కొనసాగిస్తాడా? అన్నది చూడాలి.