47/2. 192 పరుగుల ఛేదనలో ఏడు ఓవర్లు ముగిసేటప్పటికీ ఈ లీగ్లో అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) స్కోరు అది. పవర్ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టి ఆరంభంలోనే ప్రత్యర్థులను దెబ్బతీసే చెన్నై.. విశాఖపట్నంలో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్కు దాసోహమైంది. మొదట బ్యాటింగ్ చేస్తూ విశాఖ వాసులను పరుగుల జడివానలో ముంచెత్తిన ఢిల్లీ.. తర్వాత బంతితోనూ రుతురాజ్ సేనను కట్టడిచేసి ఐపీఎల్-17లో బోణీ కొట్టింది. పంత్ మెరుపు అర్ధ సెంచరీ బాదగా వార్నర్, షాలు రెచ్చిపోయి ఆడారు. ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్లు కట్టడిచేసి ఈ సీజన్లో చెన్నైకి తొలి పరాభవాన్ని పరిచయం చేశారు.
CSK | విశాఖపట్నం: ఐపీఎల్-17లో రెండు మ్యాచ్ల ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. తొలి విడత షెడ్యూల్లో భాగంగా ఢిల్లీకి సొంత మైదానంగా ఉన్న విశాఖపట్నంలోని వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తన రీఎంట్రీలో రిషభ్ పంత్ (32 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి అర్ధ సెంచరీతో చెలరేగగా డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 52, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), పృథ్వీ షా (27 బంతుల్లో 43, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. అజింక్యా రహానే (30 బంతుల్లో 45, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా ధోనీ (16 బంతుల్లో 37 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ (2/21) చెన్నైని ఆదిలోనే కోలుకోలేని దెబ్బతీయగా ముకేశ్ కుమార్ (3/21) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో ఖలీల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాటర్లు ఆది నుంచే చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. గత రెండు మ్యాచ్లలో బెంచ్కే పరిమితమై పృథ్వీ షా.. చెన్నైతో పోరులో రీఎంట్రీ ఇచ్చాడు. ఒకవైపు వార్నర్, మరోవైపు పృథ్వీ షాలు సీఎస్కే బౌలర్లను ఉతికారేశారు. తొలి 4 ఓవర్ల దాకా బంతికి ఓ పరుగు అన్నట్టుగా సాగిన ఢిల్లీ స్కోరుబోర్డు.. చాహర్ వేసిన ఐదో ఓవర్ నుంచి వేగం పుంజుకుంది. ఆ ఓవర్లో వార్నర్.. 6, 4, 4 తో బాదుడుకు గేట్లు తీశాడు. ఆ తర్వాత బాదుడు షా వంతు. ముస్తాఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో షా హ్యాట్రిక్ బౌండరీలతో అలరించాడు. ఈ ఇద్దరూ వంతులు వేసుకున్నట్టుగా చెన్నై బౌలర్లను లక్ష్యంగా చేసుకోవడంతో ఢిల్లీ స్కోరు పరుగులెత్తింది. ఎట్టకేలకు ఈ జోడీని పదో ఓవర్లో ముస్తాఫిజుర్ విడదీశాడు.
ఆరు బంతుల వ్యవధిలోనే ఓపెనర్ల నిష్క్రమించిన ఢిల్లీకి చెన్నై తురుపుముక్క మతీశ పతిరాన ఒకే ఓవర్లో రెండు షాకులిచ్చాడు. 15వ ఓవర్లో అతడు.. మిచెల్ మార్ష్ (12), ట్రిస్టన్ స్టబ్స్ను ఔట్ చేశాడు. కానీ మరో ఎండ్లో ఉన్న పంత్.. క్రీజులో కుదురుకునేదాకా నెమ్మదిగా ఆడి ఆ తర్వాత గేర్ మార్చాడు. తొలి 23 బంతుల్లో 23 పరుగులే చేసిన ఢిల్లీ కెప్టెన్.. తర్వాత 9 బంతుల్లోనే 28 పరుగులు రాబట్టాడు. ఇందులో 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లున్నాయి. 32 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తిచేశాడు.
భారీ ఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ కొత్త బంతితో నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్లోనే గైక్వాడ్ (1)ను ఔట్ చేసిన అహ్మద్.. తన రెండో ఓవర్లో రచిన్ రవీంద్ర (2)ను వెనక్కి పంపి చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు. ఖలీల్కు తోడు ఇషాంత్ శర్మ కూడా కట్టడి చేయడంతో మొదటి 5 ఓవర్లలో చెన్నై 23 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో అజింక్యా రహానే, డారిల్ మిచెల్ (26 బంతుల్లో 34, 1 ఫోర్, 2 సిక్సర్లు) చెన్నైని పోటీలోకి తెచ్చారు. మూడో వికెట్కు ఈ ఇద్దరూ 68 పరుగులు జోడించారు. 11 ఓవర్లు ముగిసేటప్పటికీ చెన్నై 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.
ఆరంభ ఓవర్లలో చెన్నైని ఖలీల్ కట్టడి చేస్తే మిడిల్ ఓవర్స్లో ముకేశ్ కుమార్ షాకులిచ్చాడు. అతడు వేసిన తొలి ఓవర్లో 2 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. క్రీజులో కుదురుకున్న రహానేతో పాటు సమీర్ రిజ్విని ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో చెన్నై కష్టాలు తీవ్రమయ్యాయి. ఆఖర్లో జడేజా (21 నాటౌట్), ఈ సీజన్లో తొలిసారి బ్యాటింగ్కు వచ్చిన ధోనీల పోరాటం ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 191/5 (వార్నర్ 52, పంత్ 51, షా 43, పతిరాన 3/31, జడేజా 1/43) చెన్నై : 20 ఓవర్లలో 171/6 (రహానే 45, ధోనీ 37 నాటౌట్, ఖలీల్ 2/21, ముకేశ్ 3/21)