Suresh Raina | ఐపీఎల్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సురేశ్ రైనాను 2022 సీజన్కు ఫ్రాంచైసీ తీసుకోలేదు. దీనికి కారణాలను సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ సోమవారం బయట పెట్టారు. మెరుగ్గా పరుగులు తీయడంతోపాటు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించినా రైనా కోసం బిడ్ దాఖలు చేయలేదన్నాడు.
ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే 205 మ్యాచ్ల్లో 5528 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 11 ఏండ్లుగా చెన్నై కోసం 4687 పరుగులు చేశాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత టాప్ స్కోరర్ రైనాయే. మిస్టర్ ఐపీఎల్గా పాపులరైన రైనాను జట్టు పరిస్థితిని బట్టే తీసుకోలేదన్నారు. ఫామ్ను బట్టే ఎవరినైనా జట్టులోకి తీసుకుంటామని చెప్పాడు విశ్వనాథ్. ప్రస్తుత ఫిట్నెస్ ప్రకారం యువ ప్లేయర్లను తీసుకున్నామన్నాడు.
సురేశ్ రైనా ఫామ్లో లేడు, ఫిట్నెస్ కూడా అంతంత మాత్రమేనని విశ్వనాథ్ స్పష్టం చేశాడు. 12 ఏండ్లుగా జట్టుకు అద్భుతమైన సేవలందించినా తిరిగి ఆయన్ను తీసుకోలేమన్నాడు. రైనాను మిస్ అవుతున్నామని చెప్పాడు. ఇక మరో ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ను కోల్పోవడం బాధాకరం అని అన్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి జట్టుకు విజయాలందించిన రైనాకు సీఎస్కే ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపింది.