మహేంద్రసింగ్ ధోనీ రాకతో చెన్నై సూపర్కింగ్స్ దశదిశ మారిపోయింది. తనదైన నాయకత్వ శైలితో సహచరుల్లో స్ఫూర్తినింపుతూ ముందుకు సాగుతున్నాడు. ఢిల్లీతో జరిగిన సండే ధమాకాలో చెన్నై భారీ విజయంతో దుమ్మురేపింది. గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుందామనుకున్న ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లింది.
ముంబై: చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) జూలు విదిల్చింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు ఢిల్లీ క్యాపిటల్స్పై పంజా విసిరింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలుత డెవాన్ కాన్వె(49 బంతుల్లో 87, 7ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధసెంచరీకి తోడు గైక్వాడ్(41) ,దూబే(32) రాణింపుతో చెన్నై 20 ఓవర్లలో 208/6 స్కోరు చేసింది. ఎన్రిచ్ నోర్జె(3/42), ఖలీల్ అహ్మద్(2/28) రాణించారు. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలింది. మొయిన్ అలీ(3/13), ముకేశ్ చౌదరి(2/22), సిమర్జీత్సింగ్ (2/27), బ్రావో(2/24) సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ బ్యాటర్లు చేష్టలుడిగిపోయారు. మిచెల్ మార్ష్(25), శార్దుల్ ఠాకూర్(24) మినహా అందరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన తెలుగు బ్యాటర్ కేఎస్ భరత్(8) నిరాశపరిచాడు. పొదుపుతో పాటు కీలక వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 208/6(కాన్వె 87, గైక్వాడ్ 41, నోర్జె 3/42, అహ్మద్ 2/28), ఢిల్లీ: 17.4 ఓవర్లలో 117 ఆలౌట్ (మార్ష్ 25, శార్దుల్ 24, అలీ 3/13, చౌదరి 2/22)