ఆఖరి మ్యాచ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో ముంబై ముందంజ వేసింది. ఒకే రోజు మూడు సెంచరీలతో అభిమానులు పండుగ చేసుకోగా.. చిన్నస్వామి స్టేడియంలో ఓటమితో బెంగళూరు సీజన్ను ముగించింది. రెండొందల పై చిలుకు లక్ష్యాన్ని ఛేదించిన రోహిత్ సేన.. 14 మ్యాచ్ల్లో ఎనిమిదో విజయంతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానం ఖరారు చేసుకుంది. మరో మ్యాచ్లో రన్మెషీన్ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్కు చేర్చలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో కోహ్లీ ఒంటరి పోరాటంతో బెంగళూరు భారీ స్కోరు చేసినా.. గిల్ మెరుపు సెంచరీ ముందు ఆర్సీబీ నిర్దేశించిన లక్ష్యం చిన్నబోయింది. ఆదివారంతో లీగ్ దశ ముగియగా.. మంగళవారం చెన్నై వేదికగా జరుగనున్న తొలి క్వాలిఫయర్లో చెన్నైతో గుజరాత్ తలపడనుంది.
బెంగళూరు: గత మ్యాచ్లో సూపర్ విక్టరీతో ఆశలు రేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. చివరి మ్యాచ్లో ఓటమితో సీజన్కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తుచేసింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. రన్మెషీన్ విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 101 నాటౌట్; 13 ఫోర్లు, ఒక సిక్సర్) వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ నమోదు చేసుకోగా..
డుప్లెసిస్ (28; 5 ఫోర్లు), బ్రాస్వెల్ (26; 5 ఫోర్లు), అనూజ్ రావత్ (23 నాటౌట్) తలా కొన్ని పరుగులు చేశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 198 రన్స్ చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (52 బంతుల్లో 104 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు), విజయ్ శంకర్ (53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) దుమ్మురేపారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 197/5 (కోహ్లీ 101 నాటౌట్; డుప్లెసిస్ 28; నూర్ 2/39, రషీద్ 1/24),
గుజరాత్: 19.1 ఓవర్లలో 198/4 (గిల్ 104*, శంకర్ 53; సిరాజ్ 2/32).