టీమిండియాకు విరాట్ కోహ్లి తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ వచ్చాక కూడా సిరీస్కు ఒక కెప్టెన్ అంటూ బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలే గాక తాజాగా విండీస్ సిరీస్కు శిఖర్ ధావన్ కూడా సారథిగా వ్యవహరించబోతున్నాడు. ఈ తరుణంలో స్వయంగా బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించాడు. అయితే దీని వెనుక గల కారణాలను అతడు వివరించాడు.
గంగూలీ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అవును ఇది కరెక్ట్ కాదు. నేను మీతో అంగీకరిస్తున్నా. కానీ మాకు గత్యంతరం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు రోహిత్ను వన్డేలకు కూడా కెప్టెన్గా నియమించినా అతడు గాయం కారణంగా వెళ్లలేదు. అందుకే మేం కేఎల్ రాహుల్ను తాత్కాలిక నాయకుడిగా నియమించాం. ఇటీవలే ముగిసిన సఫారీ సిరీస్కు రోహిత్ కు విశ్రాంతి, కేఎల్ రాహుల్కు గాయం కారణంగా పంత్కు ఆ బాధ్యతలు అప్పజెప్పాం. ఇంగ్లండ్లో రోహిత్కు కరోనా సోకడంతో బుమ్రాను సారథిగా చేశాం. వేరే ఆప్షన్లు లేకనే ఇలా చేయాల్సి వచ్చింది..’ అని అన్నాడు.
ఆటగాళ్లకు పదే పదే విరామం ఇవ్వడం పైనా దాదా బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుకు బిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎంత ఎక్కువ క్రికెట్ ఆడితే అంత స్ట్రాంగ్ అవుతారని తెలిపాడు. ‘నేను నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో తెలుసుకున్నదేంటంటే.. మీరు ఎంత ఎక్కువ క్రికెట్ ఆడితే అంత బలంగా తయారవుతారు..’ అని చెప్పాడు. తాజాగా బీసీసీఐ సెలక్టర్లు మాత్రం ఒక్క సిరీస్ ఆడగానే ఆటగాళ్లకు విశ్రాంతి పేరిట మరో సిరీస్కు పక్కనెడుతుండటం గమనార్హం.
కోహ్లిని వన్డేల్లో తప్పించినప్పట్నుంచి భారత సారథులు :
– రోహిత్ శర్మ
– కెఎల్ రాహుల్ (దక్షిణాఫ్రికా పర్యటనలో ఒక టెస్టు, మూడు వన్డేలు)
– రిషభ్ పంత్ (స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్)
– హార్దిక్ పాండ్యా (ఐర్లాండ్ పర్యటనకు)
– జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లాండ్ తో ముగిసిన ఆఖరి టెస్టు)
– శిఖర్ ధావన్ (వెస్టిండీస్ తో మూడు వన్డేలకు)