భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత షూటర్లు మారోసారి నిరాశ పర్చగా.. బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ విజయం సాధించినా.. ముందడుగు వేయలేకపోయింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో అర్హత సాధించలేకపోగా.. టేబుల్ టెన్నిస్లో శరత్ కమల్ ఓటమి పాలయ్యాడు. గత మ్యాచ్ ఓటమి నుంచి కోలుకున్న పురుషుల హాకీ జట్టు తిరిగి పుంజుకోవడం ఊరటనిచ్చే అంశం కాగా.. అసాధారణ ప్రదర్శనతో యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ క్వార్టర్స్లో అడుగుపెట్టింది.
టోక్యో: విశ్వక్రీడల్లో భారత అథ్లెట్ల ప్రదర్శన ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నది. వరుసగా మూడో రోజు మనవాళ్లు రిక్తహస్తాలతోనే వెనుదిరిగారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు ఉసూరుమనిపిస్తే.. బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గెలిచినా.. నాకౌట్కు అర్హత సాధించలేకపోయింది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్ (టీటీ), సెయిలింగ్లో నిరాశే ఎదురవగా.. పురుషుల హాకీ జట్టు స్పెయిన్పై గెలువడం.. బాక్సింగ్లో లవ్లీనా బొర్గోహైన్ క్వార్టర్స్లో అడుగుపెట్టడం విశ్వక్రీడల్లో మంగళవారం భారత్కు సంతోషాన్నిచ్చాయి.
పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన లవ్లీనా బొర్గోహైన్.. మహిళల 69 కేజీల విభాగంలో అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్స్లో అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్లో లవ్లీనా 3-2తో నడైన్ అపెట్జ్ (జర్మనీ)పై విజయం సాధించింది. భారత్ నుంచి 9 మంది బాక్సర్లు టోక్యోలో అడుగుపెట్టగా.. క్వార్టర్స్ చేరిన తొలి బాక్సర్గా లవ్లీనా నిలిచింది. మరొక్క బౌట్లో గెలిస్తే.. లవ్లీనాకు పతకం ఖాయం కానుంది. బుధవారం పోటీల్లో ఇచ్రాక్ చైబ్ (అల్జెరియా)తో భారత బాక్సర్ పూజారాణి (75 కేజీలు) తలపడనుంది.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట విజయం సాధించినా.. నాకౌట్కు అర్హత సాధించడంలో విఫలమైంది. మంగళవారం జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లో సాత్విక్ జోడీ 21-17, 21-19తో బెన్ లేన్-సీన్ వెన్డే (ఇంగ్లండ్)పై గెలుపొందింది. కాగా.. ఈ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఇండోనేషియా, చైనీస్ తైపీ క్వార్టర్స్కు చేరగా.. మూడో స్థానంలో నిలిచిన భారత జంట నిరాశగా తిరుగు పయనమైంది. మూడు జట్లు రెండేసి మ్యాచ్ల్లో విజయాలు సాధించి.. సమాన పాయింట్లతో నిలిచినా.. ఇండోనేషియా చేతిలో వరుస గేమ్లలో ఓటమి పాలవడం మనవాళ్ల కొంపముంచింది.
తొలి మ్యాచ్లో చక్కటి విజయంతో టోక్యో ఒలింపిక్స్ను ఘనంగా ఆరంభించిన భారత పురుషుల హాకీ జట్టు.. తదుపరి మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయంతో చతికిలబడింది. ఆ ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న మన్ప్రీత్ సింగ్ సేన మంగళవారం పోరులో 3-0తో స్పెయిన్ను చిత్తు చేసింది. డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ (15వ, 51వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ నమోదు చేయగా.. సిమ్రన్జీత్ సింగ్ (14వ ని.లో) ఓ గోల్తో మెరిశాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ భారత్.. 9వ స్థానంలో ఉన్న స్పెయిన్పై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించి విజయం సాధించిన భారత్.. క్వార్టర్ ఫైనల్కు సమీపించింది. గురువారం జరుగనున్న తదుపరి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో భారత జట్టు అమీతుమీ
తేల్చుకోనుంది.
మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కోటి ఆశలతో అడుగుపెట్టిన భారత షూటర్లు పూర్తిగా నిరాశ పరిచారు. పిస్టల్, రైఫిల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ రౌండ్స్లోనే వెనుదిరిగారు. స్టార్ షూటింగ్ జోడీ సౌరభ్ చౌదరి-మనూబాకర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 582 పాయింట్లతో తుదిపోరుకు చేరుకోలేకపోగా.. అభిషేక్ వర్మ-యశస్విని సింగ్ 564 పాయింట్లతో 17వ స్థానానికే పరిమితమైంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఎలవనిల్ వలరివన్-దివ్యాన్ష్ 12వ స్థానంతో సరిపెట్టుకోగా.. అంజుమ్-దీపక్ జంట 18వ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత విభాగాల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మన షూటర్లు పతకాలు తేవడం పక్కా అని భావిస్తే.. ముకుమ్మడిగా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు.
టేబుల్ టెన్నిస్ (టీటీ) బరిలో ఉన్న ఏకైక ఆటగాడు ఆచంట శరత్ కమల్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఓటమి పాలయ్యాడు. మంగళవారం పోరులో శరత్ 2-3 (7-11, 11-8, 11-13, 4-11, 4-11)తో డిఫెండింగ్ చాంపియన్ మా లాంగ్ (చైనా) చేతిలో ఓడాడు. తన కెరీర్లో ఆడిన అత్యంత కఠినమైన గేమ్ ఇదే అని మ్యాచ్ అనంతరం పేర్కొన్న శరత్.. పారిస్ (2024) ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన చేస్తానని అన్నాడు.
విశ్వక్రీడల టెన్నిస్లో భారత కథ ముగిసింది. పురుషుల
సింగిల్స్లో సుమీత్ నాగల్ రెండో రౌండ్లో.. మహిళల డబుల్స్లో సానియా మీర్జా-అంకితా రైనా జోడీ తొలి రౌండ్లో ఓటమి పాలవగా.. మిక్స్డ్ డబుల్స్లో పోటీపడే అవకాశం కూడా భారత్కు దక్కలేదు. సానియా-నాగల్ జంట మిక్స్డ్ ర్యాం కింగ్స్లో 153వ స్థానంలో నిలువగా.. 50 ర్యాంక్ల లోపు ఉన్నవాళ్లే పోటీలకు అర్హత సాధించారు.
సెయిలింగ్లోనూ మనవాళ్లకు నిరాశ తప్పలేదు. పురుషుల విభాగంలో విష్ణు శరవణన్ 22వ స్థానంతో సరిపెట్టుకోగా.. మహిళల విభాగంలో భారత్ నుంచి తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నేత్ర కుమానన్ 33వ ప్లేస్లో నిలిచింది.
మ్యాచ్లో ఓడిపోతున్నాననే అసహనంతో మొరాకోకు చెందిన బాక్సర్ యూనీస్ బాల్లా.. న్యూజిలాండ్ బాక్సర్ డేవిడ్ న్యీకా చెవి కొరికాడు. మంగళవారం జరిగిన బాక్సింగ్ పోటీ లో డేవిడ్ తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనీస్ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనీస్.. మూడో రౌండ్లో డేవిడ్ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్ దంతాలు తగలగానే డేవిడ్ అతడిని దూరంగా నెట్టేశాడు. ఈ మ్యాచ్లో డేవిడ్ 5-0 తేడాతో యూనీస్ను ఓడించాడు. కాగా, యూనీస్ అనుచిత ప్రవర్తనతో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది.
జిమ్నాస్టిక్స్ ప్రపంచ నంబర్వన్ సిమోన్ బైల్స్.. విన్యాసాలకు కాస్త బ్రేక్ పడింది. మంగళవారం అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టీమ్ ఫైనల్ నుంచి బైల్స్ అర్ధాంతరంగా నిష్క్రమించింది. ఫీట్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుదుపునకు లోనైన బైల్స్.. ఫిజికల్ ట్రైనర్ సహాయంతో పోడియం నుంచి తప్పుకుంది. అయితే బయటకు వచ్చిన బైల్స్.. సహచరులను ఉత్సాహపరుస్తూ కనిపించింది. ఆమె గైర్హాజరీలో అమెరికా రజత పతకంతో సరిపెట్టుకోగా, రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్వోసీ) పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. తొలుత గాయంతో వైదొలిగిందనుకున్న బైల్స్..మానసిక ఒత్తిడి కారణంగానే తప్పుకొంటున్నానని వివరించింది.
ఒలింపిక్స్లో జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా పోరాటం ముగిసింది. ప్రారంభ వేడుకల్లో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన ఒసాకా.. స్వదేశంలో పతకం పట్టాలని భావించినా ఆమె కల నెరవేరలేదు. మంగళవారం ఇక్కడ జరిగిన మూడో రౌండ్లో ఒసాకా 1-6, 4-6 తేడాతో వొండ్రొసోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలయ్యింది. ప్రపంచ నంబర్ 2 అయిన ఒసాకా.. 42వ ర్యాంకర్ వొండ్రొసోవా చేతిలో ఓటమితో తీవ్ర నిరాశకు లోనైంది.
‘నేను గెలిచినా ఓడినా నా కూతురు పట్టించుకోదు. తనకు కావాల్సింది నేను తనతో ఉండటం.. నా గెలుపోటముల గురించి తనకు అవసరం లేదు. నన్ను త్వరగా ఓడిపోయి ఇంటికి వచ్చేయమని అంటున్నది’ అని ఆస్ట్రేలియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి లీ జియా తెలిపింది. మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న లీ..
ఆస్ట్రేలియాలో ఉంటున్న కూతురు తనను త్వరగా ఇంటికి రావాలని మారాం చేస్తున్నదని చెప్పుకొచ్చింది. 39 ఏండ్ల లీ.. తన తొలి మ్యాచ్లో అతి పిన్న ఒలింపియన్ హెండ్ జజాను ఓడించిన విషయం తెలిసిందే.