హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సాట్స్ చలో మైదాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘చలో మైదాన్ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్రీడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్న విధానంపై సదస్సులో వివరిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి, స్పోర్ట్స్ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.