Yuzvendra Chahal : భారత జట్టులో దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నాడంటే అది కచ్చితంగా యుజ్వేంద్ర చాహలే (Yuzvendra Chahal). ఈ లెగ్ స్పిన్నర్ దాదాపు టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్లోనూ ఉంటాడు. కానీ, విచిత్రంగా ఐసీసీ టోర్నీ (ICC Tournament) వచ్చేసరికి జట్టులో అతడికి చోటు దక్కదు. మేజర్ టోర్నీలు అనగానే అతడి ప్రతిభాపాటవాలు సెలక్టర్లకు ఎందుకూ కొరగాకుండా పోతాయి. ఈసారి కూడా అదే జరిగింది. ఈ నెల 30న ప్రారంభమయ్యే ఆసియా కప్(Asia Cup 2023)జట్టులోనూ చాహల్కు చోటు లభించలేదు.
సొంతగడ్డపై అక్టోబరు 5న వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ప్రారంభం కానుంది. అంతకంటే ముందు ఈ నెల 30 ఆసియాకప్ జరగనుంది. ఈ జట్టులోనూ చాహల్కు చోటు దక్కలేదు. జట్టు సమతూకంగా ఉండాలి కాబట్టి అతడికి స్థానం కల్పించలేకపోయామని చీఫ్ సెలక్టర్ అజిత అగార్కర్(Ajit Agarkar) సెలవిచ్చాడు.
అజిత అగార్కర్, చాహల్
చాహల్ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)కు చోటు లభించింది. చాహల్తో పోలిస్తే అక్షర్ పటేల్కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండడం అందుకు కారణం కావచ్చు. చాహల్ను పక్కనపెట్టడంపై కెప్టెన్ రోహిత్శర్మ మాట్లాడుతూ.. జట్టులో చోటు దక్కలేదన్న ఆందోళన అవసరం లేదని, ప్రపంచ కప్ జట్టులో అతడికి తప్పకుండా స్థానం లభించవచ్చని చెప్పుకొచ్చాడు.
క్రీడా విశ్లేషకులు ఊహించినట్టుగానే 2021 టీ20 ప్రపంచ కప్ జట్టులో చాహల్కు చోటు దక్కలేదు. అంతకంటే విడ్డూరం ఏమిటంటే.. అతడి స్థానంలో ఏమాత్రం అనుభవం లేని వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని జట్టులోకి తీసుకోవడం. ఈ విషయమై అప్పట్లో సెలక్టర్లు చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
డివిలియర్స్, చాహల్
దీంతో 2022 టీ20 ప్రపంచ కప్లో ఈ లెగ్స్పిన్నర్కు చోటు లభించింది. ఇక, మనోడు తిప్పేస్తాడని అందరూ భావించారు. అయితే, ఏమైందో తెలియదు అతడిని బెంచ్కే పరిమితం చేశారు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చాహల్ మరో ఐసీసీ ఈవెంట్ మిస్ కావడం ఖాయం అనిపిస్తోంది.
ఆసియాకప్ జట్టులో చాహల్కు మొండిచేయి చూపించడంపై ఐపీఎల్లో అతడి సహచరుడు ఏబీ డివిలియర్స్(AB De Villiers) స్పందించాడు. చాహల్ చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడని ప్రశంసించాడు. ఒకవేళ అతడిని తీసుకుంటే కనుక ఇండియాకు మంచి ఆప్షన్ అవుతాడని అన్నాడు. చాహల్ను పక్కనపెట్టడం తనను బాధించిందని అన్నాడు. వీరిద్దరూ గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ప్రాతినిధ్యం వహించారు. ఆసియా కప్లో భాగంగా భారత జట్టు సెప్టెంబరు 2న పాక్తో తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదిక కానుంది.