హైదరాబాద్లో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్స్టార్ స్పెక్టాకిల్ పోటీలు కేక పుట్టించాయి. నగరంలో తొలిసారి జరిగిన రెజ్లింగ్ పోటీలకు అభిమానులు వెల్లువలా తరలివచ్చారు. ఇన్నాళ్లు టీవీల్లో చూసి మురిసిపోయిన అభిమానులు..ప్రత్యక్షంగా రెజ్లర్ల ఫైట్ చూసి అచ్చెరువొందారు. తమ ఆరాధ్య రెజ్లర్లు కండ్ల ముందు తలపడటం ఫ్యాన్స్కు ఎనలేని ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. డబ్లూడబ్ల్యూఈలో కింగ్లా వెలుగొందుతున్న స్టార్ రెజ్లర్ జాన్సీనా పోరు అసలైన కిక్కు ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులను జాన్సీనా తనదైన శైలిలో దుమ్మురేపుతూ ప్రత్యర్థిని మట్టికరిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ టోర్నీ ఘనంగా జరిగింది. ఇప్పటికే ఫార్ములా-ఈ లాంటి టోర్నీలకు ఆతిథ్యమిచ్చి అందరి మన్ననలు అందుకున్న రాష్ట్రం తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు ఆతిథ్యమిచ్చి ఔరా అనిపించింది. ఆరేండ్ల తర్వాత తొలిసారి భారత్లో హైదరాబాద్ వేదికగా ఈ పోటీలు జరిగాయి. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలకు నగరం నలువైపులా నుంచి అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. తమ అభిమాన రెజ్లర్ల మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు ఎక్కడా వెనుకకు తగ్గలేదు. బౌట్ల విషయానికొస్తే.. ఫ్యాన్స్కు అత్యంత ఆసక్తి కల్గించిన జాన్సీనా బౌట్ వారేవ్వా అనిపించింది. డబ్ల్యూడబ్ల్యూఈలో తనకంటూ ప్రత్యేకత దక్కించుకున్న ఈ స్టార్ రెజ్లర్..సీత్ రోలిన్స్ కలిసి బరిలోకి దిగాడు. బౌట్లోకి రావడం ఆలస్యం.. ప్రత్యర్థిపై బెబ్బులిలా విరుచుకుపడ్డాడు. లుడ్విగ్ కైసర్, గియోనీ విన్సి జోడీని మట్టికరిపిస్తూ ట్యాగ్ టీమ్ టైటిల్ను నిలబెట్టుకున్నారు. తొలుత ట్యాగ్టీమ్గా భావించినా..ఆ తర్వాత అనుహ్యంగా డ్రూ మెక్లెంట్రీ, జిందర్ మహల్ ఎంట్రీతో పోటీ ఇంకా రసవత్తరంగా మారింది. దీనికి తోడు మ్యాట్ రిడిల్స్ కూడా రింగ్లోకి రావడం కొత్త డ్రామాకు తెరతీసింది.
ఇండస్ షేర్(వీరా మహాన్, సంగా)..తొలి బౌట్లో కెవిన్ ఓవెన్స్, సమి జైన్ మధ్య పోరు జరిగింది. అయితే జిందర్ మహల్ సడెన్ ఎంట్రీ బౌట్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో పోరు కాస్తా ఇండస్ షేర్, జిందర్ మహల్, డ్రూ మెకెంట్రీ, ఒవెన్స్, సమీ మధ్య యుద్ధంలా మారింది. మెకెంట్రీ..టీమ్ఇండియా జెర్సీ ధరించి రావడం అభిమానులను ఆకట్టుకుంది. మెకెంట్రీ, మహల్ ఒకరికొకరు పంచ్లు విసురుకున్నారు. వాస్తవానికి ఈ బౌట్కు వీరిద్దరికి ఎలాంటి సంబంధం లేకపోయినా వీరు కలుగజేసుకున్నారు. చివరకు మెకకెంట్రీ, ఓవెన్స్, సమి జైన్ త్రయాన్ని విజయం వరించింది. ఇక మహిళల పోరులో జోయ్ స్టార్క్తో జరిగిన పోరులో నటాల్యనే విజయం వరించింది. మహిళల చాంపియన్షిప్ కోసం రియా రిప్లేతో నటాల్య తలపడాల్సి ఉంది.
స్టేడియంలో ఆర్సీబీ..ఆర్సీబీ అంటూ అభిమానులు గోలగోల చేశారు. ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్షిప్ టైటిల్ను గుంతర్ దక్కించుకున్నాడు. వాస్తవానికి డ్రూ మెకెంట్రీతో పోరు జరుగాల్సి ఉన్నా..షాంకీతో జరిగిన బౌట్లో గుంతర్ గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ పోరులో షాంకీకి అభిమానులు మద్దతుగా నిలిచారు. మహిళల టైటిల్ ఫైట్లో నటాల్యపై రియా రిప్లేపై గెలిచి మరోమారు విజేతగా నిలిచింది.
డబ్ల్యూడబ్ల్యూఈ బౌట్ను వీక్షించేందుకు స్లార్లు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. టీమ్ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్, సినీ హీరో కార్తీ, స్టార్ రెజ్లర్ గ్రేట్ కాళీ, మంత్రి శ్రీనివాస్గౌడ్ తదితరులు హాజరయ్యారు.