పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో స్టార్ల నిష్ర్కమణ పర్వం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే యానిక్ సినర్, నొవాక్ జొకోవిచ్, మెద్వెదెవ్ తమ పోరాటం ముగించగా, తాజాగా కాస్పర్ రూడ్(నార్వే) ఇంటిబాట పట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో రూడ్ 5-7, 6-7(8/10), 7-5, 2-6తో జావో ఫోన్సెకా(బ్రెజిల్) చేతిలో ఓటమిపాలయ్యాడు. నాలుగు సెట్ల పాటు జరిగిన పోరులో ఫోన్సెకా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏడు ఏస్లు సంధించిన రూడ్ నాలుగు సార్లు డబుల్ ఫాల్ట్స్ చేయడం కొంపముంచింది. మరో మ్యాచ్లో కొబోలీ(ఇటలీ) 6-2, 6-3, 6-7(3/7), 7-6(7/5) జచరీ సావ్జా(అమెరికా)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఇక, మహిళల సింగిల్స్లో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ 3-6, 6-3, 0-6తో డయానా షెడ్నర్(రష్యా) చేతిలో ఓడగా, డియానె పెర్రీ(ఫ్రాన్స్) 3-6, 2-6తో చావ్లానిస్కా(పోలాండ్) పరాజయం పాలైంది. అనా కలిన్స్కయా(రష్యా) 6-4, 2-6, 7-6(10/7)తో పొటాపోవా(ఆస్ట్రియా)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో భారత్, బ్రెజిల్ ద్వయం శ్రీరామ్ బాలాజీ- డెమోలినర్ 7-5, 6-4తో టిమ్ పట్జ్- కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్స్ చేరుకుంది.