IPL 2023: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. సీఎస్కే మేనేజ్మెంట్ ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన ఓ లాయర్ కేసు దాఖలు చేశారు.
చెన్నైకి చెందిన అశోక్ చక్రవర్తి అనే లాయర్ సీఎస్కేతో పాటు బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్పై చెన్నై సివిల్ కోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. సీఎస్కే టీం హోం గ్రౌండ్లో ఆడిన మ్యాచ్లకు సంబంధించిన టికెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బ్లాక్లో విక్రయించిందని ఆరోపించారు. తక్కువ ధరలో ఉండే లోయర్ స్టాండ్ టికెట్లను రూ.8వేలకు అమ్మినట్లు, అందులో సీఎస్కే మేనేజ్మెంట్ పాత్ర కూడా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
MA చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు, బ్లాక్ మార్కెట్, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినట్లు లాయర్ తెలిపారు.
అయితే ధోనికి ఈ సీజన్ చివరిదనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అతడి ఆట చూసేందుకు అభిమానులు ఎంత ధరకైనా టికెట్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ స్టేజ్లో తన చివరి మ్యచ్ను ఢిల్లీతో ఆడనుంది. 15 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది.