AB DE Villiers | పుష్కర కాలం తర్వాత భారత్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతాలు చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. ప్రస్తుత తరంలో కోహ్లీనే మేటి ఆటగాడని గతంలోనే పలుమార్లు బల్లగుద్ది చెప్పిన ఏబీడీ.. తన నమ్మకాన్ని కోహ్లీ నిలబెడతాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున చాన్నాళ్ల పాటు కలిసి ఆడిన వీరిద్దరి మధ్య చక్కటి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కూడా.. ఏబీడీ.. కోహ్లీతో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. వన్డే వరల్డ్కప్ ప్రారంభానికి నిండా నెల రోజులు కూడా లేని సమయంలో ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మెగాటోర్నీలో కోహ్లీ ఆట చూసేందుకు చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా. అతడి విన్యాసాలు చూసేందుకు ఆగలేకపోతున్నా. భారత్ తరఫున అతడు ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉంది’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. వచ్చే నెల 5 నుంచి వరల్డ్కప్ ప్రారంభం కానుండగా.. తొలి పోరులో గత ఫైనలిస్ట్లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. చివరిసారిగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు టైటిల్ గెలుచుకోగా.. మరోసారి సొంతగడ్డపై జరుగనున్న టోర్నీలో కప్పు కొట్టి మూడో టైటిల్ ఖాతాలో వేసుకోవాలని టీమ్ఇండియా తహతహలాడుతున్నది. వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 8న చెన్నై వేదికగా తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.